USA: అత్యంత సురక్షితమైనది ఫైజర్ వ్యాక్సిన్: తేల్చిన యూఎస్ ఎఫ్డీఏ

  • అమెరికన్ ప్రజల్లో సస్పెన్స్ కు తెరదించిన ఎఫ్డీయే
  • తొలి అనుమతి ఫైజర్ వ్యాక్సిన్ కే దక్కే అవకాశాలు
  • గురువారం సమావేశం కానున్న స్వతంత్ర కమిటీ
  • వ్యాక్సిన్ సురక్షితపై కీలక సమీక్ష
Pfizer Vaccine is Safe says USFDA Report

అమెరికాలో తొలిసారిగా ప్రజలకు అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్ ఏంటో దాదాపు తెలిసిపోయింది. ప్రజల్లో ఉన్న సస్పెన్స్ కు తెరదింపుతూ ఫైజర్ - బయో ఎన్ టెక్ తయారు చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ సురక్షితమని, ప్రభావవంతమైనదని యూఎస్ ఎఫ్డీఏ (యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) ఓ డాక్యుమెంట్ ను విడుదల చేసింది.

 దీంతో తొలుతగా ఫైజర్ వ్యాక్సిన్ కే అనుమతి లభిస్తుందన్న ఊహాగానాలకు మద్దతు చేకూరింది. ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ కు బ్రిటన్ అనుమతి ఇవ్వడంతో పాటు, పంపిణీ కూడా ప్రారంభించడంతో ఎఫ్డీయే నేతృత్వంలోని ఓ స్వతంత్ర కమిటీ గురువారం సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

ఇందులో భాగంగా, ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న దాదాపు 38 వేల మంది వలంటీర్ల ఆరోగ్యం, వారిలో పెరిగిన యాంటీ బాడీలు, వ్యాక్సిన్ సురక్షిత తదితరాలను పరిగణనలోకి తీసుకుని అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వ్యాక్సిన్ 95 శాతం మేరకు పనిచేస్తోందని ఇప్పటివరకూ నిర్వహించిన ట్రయల్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అన్ని వయసుల వారిలోనూ ఈ వ్యాక్సిన్ ప్రభావశీలమైనదేనని, హై రిస్క్ ఉన్నవారిలోనూ యాంటీ బాడీలను పెంచిందని ట్రయల్స్ నివేదికలు ఇప్పటికే స్పష్టం చేశాయి.

అయితే, హై రిస్క్ వర్గంలోనూ ఈ వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేస్తుందన్న విషయాన్ని నిర్ధారించేందుకు మరిన్ని ఆధారాలు కావాలని ఎఫ్డీయేలోని కొందరు అధికారులు వ్యాఖ్యానించారు. రెండు డోస్ లు తీసుకున్న తరువాత కూడా ఎవరికైనా వైరస్ సోకిందా? అన్న విషయాన్ని కూడా తేల్చాల్సివుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

కాగా, ఇప్పటివరకూ ఫైజర్ వ్యాక్సిన్ ను 43 వేల మంది తీసుకోగా, అందులో దాదాపు 5 వేల మంది గురించిన సమాచారం ఇంకా నియంత్రణా సంస్థలకు చేరలేదని తెలుస్తోంది. అయితే, ఇంజక్షన్ ఇచ్చిన శరీర భాగం వద్ద 84 శాతం రియాక్షన్, 63 శాతం మందిలో నీరసం, 55 శాతం మందికి తలనొప్పి, 38 శాతంలో కండరాల నొప్పులు, 23.6 శాతంలో కీళ్ల నొప్పులు, 14 శాతం మందికి జ్వరం వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, ఇవన్నీ చాలా చిన్న సమస్యలేనని, ఒకటి లేదా రెండు రోజుల్లోనే తగ్గిపోతాయని ఫైజర్ శాస్త్రవేత్తలు అంటున్నారు.

More Telugu News