Husband: నెత్తుటి మడుగులో భార్య... పక్కనే తాపీగా వీడియో గేములు ఆడుకుంటూ భర్త!

  • జోధ్ పూర్ లో దారుణం
  • భార్యతో గొడవపడిన భర్త
  • కత్తెరతో విచక్షణ రహితంగా దాడి
  • తీవ్రగాయాలతో కుప్పకూలిన భార్య
  • అత్తమామలకు ఫోన్ లో తెలిపిన కిరాతక భర్త
Husband was playing video games after killed wife

రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసి, ఆమె నెత్తుటి మడుగులో ఉండగా... పక్కనే కూర్చుని అసలేమీ జరగనట్టు వీడియో గేములు ఆడుకుంటూ కనిపించిన దృశ్యం పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది.

జోధ్ పూర్ లో నివసించే విక్రమ్ సింగ్, శివ్ కన్వర్ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఏ పని చేయకుండా తమను పట్టించుకోకపోవడంతో శివ్ కన్వర్ కుట్టుపని చేస్తూ, కుటుంబ పోషణ భారాన్ని మోసేది. కష్టపడి పనిచేసే భార్యతో విక్రమ్ సింగ్ తరచుగా గొడవ పడేవాడు. నిన్న కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన విక్రమ్ సింగ్ చేతికందిన కత్తెర తీసుకుని భార్యపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో రక్తపు మడుగులోనే శివ్ కన్వర్ కుప్పకూలిపోయింది.

భార్య చనిపోయిందన్న బాధ కూడా లేకుండా విక్రమ్ సింగ్ ఆ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు ఫోన్ లో తెలిపాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చేసరికి శివ్ కన్వర్ విగతజీవురాలిగా పడివుంది. ఆమె పక్కనే కూర్చుని మొబైల్ ఫోన్లో వీడియో గేములు ఆడుకుంటూ భర్త విక్రమ్ సింగ్ కనిపించాడు. దాంతో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు, శివ్ కన్వర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

More Telugu News