Pawan Kalyan: ప్రతి రైతుకు ఆర్థికసాయం అందేంత వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: పవన్ కల్యాణ్

  • రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు
  • చేతికొచ్చిన పంటను రైతులు నష్టపోవడం బాధాకరం
  • రైతుల్లో భరోసా నింపేందుకే వచ్చాను
Will pressurise govt till each farmer gets compensation says Pawan Kalyan

అన్నం పెట్టే రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. నివర్ తుపాను వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ఆర్థిక సాయం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో సమావేశమై వారి ఇబ్బందులను తెలుసుకున్నారు.

ఉయ్యూరులో భారీ వర్షాల వల్ల కుళ్లిపోయిన వరి కంకులను పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుపాను వల్ల రైతులకు కలిగిన నష్టాన్ని తెలుసుకోవడానికి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నానని చెప్పారు. పంట చేతికొచ్చిన సమయంలో విపత్తు వల్ల రైతులు నష్టపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అప్పులపాలైన రైతులను మరింత కుంగదీసేలా నష్టాలు ఉన్నాయని అన్నారు. రైతులకు నష్టపరిహారం అందేంత వరకు తాము పోరాటం చేస్తామని చెప్పారు. రైతులకు అండగా ఉంటామని అన్నారు. వారిలో భరోసా నింపేందుకే వచ్చానని తెలిపారు.

More Telugu News