shriti hassan: అందుకే షూటింగ్ నుంచి వెళ్లిపోయాను.. అలాంటి వాళ్లని చూస్తే కోపం వస్తుంది: హీరోయిన్ శ్రుతి

  • విజయ్‌ సేతుపతి సినిమాలో నటిస్తోన్న శ్రుతి హాసన్
  • షూటింగ్ చూడడానికి పెద్ద ఎత్తున వచ్చిన స్థానికులు
  • ఇటీవల షూటింగ్ నుంచి వెళ్లిపోయిన వైనం
  • ప్రజలు కరోనాని సాధారణంగా తీసుకుంటున్నారని వ్యాఖ్య
dont like those people says srithi

స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ ప్రస్తుతం విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో ఎస్పీ జననాథన్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న 'లాభం' అనే తమిళ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొన్న శ్రుతి సెట్ నుంచి తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. సినిమా షూటింగ్‌ను చూడడానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఈ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణ ఇటీవల తమిళనాడులోని ధర్మపురి, కృష్ణగిరి పరిసర ప్రాంతాల్లో జరిగిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ఎన్నో రకాలుగా వార్తలు రావడంతో ఆమె స్పందించింది. కరోనా వల్ల అందరికీ ప్రమాదం ఉందని, అందుకే వెళ్లిపోయానని ఆమె తాజాగా వివరించి చెప్పింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ అనంతరం ఇచ్చిన సడలింపులతో షూటింగ్‌ ప్రారంభించిన సమయంలో సెట్‌లో అన్ని జాగ్రత్తలు పాటించేవాళ్లమని, అయితే, క్రమంగా ప్రజలు కరోనాని సాధారణంగా తీసుకుంటున్నారని చెప్పింది.

కరోనా అంటే అది చిన్న జలుబు కాదని, తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుందని చెప్పింది. వ్యక్తిగతంగా ఎవరి జాగ్రత్తలు వాళ్లు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కొందరు కనీసం మాస్క్‌ కూడా సరిగ్గా ధరించట్లేదని తెలిపింది. తనకు అటువంటి వాళ్లని చూస్తే కోపం వస్తుందని చెప్పింది. లాక్‌డౌన్‌ వల్ల ఇప్పటికే తాను ఒకసారి బ్రేక్‌ తీసుకున్నానని తెలిపింది.

ఒంటరిగా జీవించడం వల్ల ఈ ఏడాది ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, జీవితంపట్ల ఓ స్పష్టత వచ్చిందని చెప్పింది. తాను సంగీతం‌ కోసం సమయాన్ని కేటాయించగలిగానని, వచ్చే ఏడాది వ్యక్తిగతంగా ఇలాగే ఉండాలనుకుంటున్నానని వివరించింది. కాగా, ఆమె ప్రస్తుతం తెలుగులో గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపుదిద్దుకుంటోన్న ‘క్రాక్’‌ సినిమాలోనూ నటిస్తోన్న విషయం తెలిసిందే.

More Telugu News