Rajani: ఇప్పట్లో వద్దులే... అభిమానులకు సర్దిచెప్పిన రజనీకాంత్!

  • రాజకీయాలు ఇప్పటికిప్పుడు వద్దు
  • 50 మంది కీలక ప్రతినిధులతో రజనీ భేటీ
  • మరికాసేపట్లో ప్రకటన విడుదల చేసే అవకాశాలు
Rajanikant Not Intrested in Politics

ఇప్పటికిప్పుడు మనకు రాజకీయాలు వద్దులే అని సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఉదయం 10 గంటలకు రజనీకాంత్ సమావేశ మందిరానికి రాగా, ఆపై అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. బీజేపీ వ్యతిరేక నినాదాలు చేస్తూ, రాజకీయాల్లోకి రావాలని, ఈ మేరకు రజనీ స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని ఫ్యాన్స్ అంతా ముక్తకంఠంతో ప్రశ్నించిన వేళ, రజనీ వారందరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

రజనీ స్వయంగా పార్టీ పెట్టాల్సిందేనని ఫ్యాన్స్ అంతా డిమాండ్ చేస్తున్న వేళ, రజనీకాంత్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. అభిమానులు, జిల్లా కమిటీల ప్రతినిధులు దాదాపు 50 నిమిషాల పాటు మాట్లాడారు. తమ హీరో వస్తే మాత్రమే ఓటేస్తాం తప్ప, ఆయన మరో పార్టీకి మద్దతిస్తామని చెబితే ఏ మాత్రమూ సదరు పార్టీకి మద్దతివ్వబోమని పలువురు స్పష్టం చేయడం గమనార్హం.

ఆ తరువాత రజనీ ప్రసంగిస్తూ, ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, ఈ సమయంలో పొత్తులకు చర్చలు కూడా జరుగుతున్నాయని తెలిపిన ఆయన, అభిమానులు ఎవరూ తొందరపడవద్దని అన్నారు. మక్కల్ మండ్రం తమిళనాడులో చాలా బలంగా ఉందని చెబుతూ, అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపిన ఆయన, పార్టీపై మాత్రం స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.

కాగా, ఈ సమావేశానికి కేవలం 50 మందిని మాత్రమే పిలిపించగా, రాఘవేంద్ర కల్యాణ మండపం బయట మాత్రం వేలాది మంది అభిమానులు రజనీ అనుకూల నినాదాలు చేస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల క్రితమే దేవుడు ఆశీర్వదిస్తే రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన తలైవా, ఇంతవరకూ ఆ విషయంలో స్పష్టతను మాత్రం ఇవ్వలేదన్న సంగతి తెలిసిందే. ఇక నేటి సమావేశం అనంతరం రజనీ ఓ ప్రకటన విడుదల చేస్తారని, అందులో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతారని అభిమాన సంఘాల నేతలు అంటున్నారు.

More Telugu News