biryani: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో భారీగా పెరిగిన బిర్యానీ గిరాకీ

  • లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ లోని హోటళ్లకు ఇటీవల ఇబ్బందులు
  • గిరాకీ పెంచిన జీహెచ్ఎంసీ ఎన్నికలు
  • కార్యకర్తలకు బిర్యానీల కోసం నాయకుల ఆర్డర్లు
  • హోటళ్లలో అనుచరులతో ఉంటోన్న 5 వేల మంది నాయకులు
demand for biryani in hyderabad

హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అయితే, లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ లోని హోటళ్లు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కున్నాయి. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బిర్యానీకి వస్తోన్న గిరాకీతో హోటళ్ల బిజినెస్ జోరుగా సాగుతోంది.

ఎందుకంటే ఎన్నికల ప్రచార సమయంలో కార్యకర్తలకు, మద్దతు దారులకు నాయకులు బిర్యానీ కొనిస్తుంటారు. చాలా మంది డబ్బుతో పాటు బిర్యానీ కూడా వస్తుందన్న ఆశతోనే ప్రచారంలో పాల్గొంటారు. హోటళ్లకు భారీగా ఆర్డర్లు  వస్తున్నాయి. బల్క్‌గా ఇస్తున్న ఫుడ్‌ ఆర్డర్లతో పాటు హోమ్‌ డెలివరీలు  సైతం భారీగా ఊపందుకున్నాయి.

కరోనా కేసుల సంఖ్య కూడా తగ్గడంతో హోటళ్లకు వెళ్తున్న వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. లాక్ డౌన్ తో అద్దెలు కట్టలేక, సిబ్బందికి జీతాలివ్వలేక ఇబ్బందులు పడ్డ హోటళ్ల యజమానులు ఇప్పుడు ఖుషీ అవుతున్నారు. మార్చి నుంచి ఆగస్టు వరకు హైదరాబాద్ లోని 79 శాతం రెస్టారెంట్లు మూతబడ్డాయి. ఈ నెలలో పరిస్థితి బాగా మెరుగైంది.

 జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో 150 డివిజన్లలో ప్రచారం చేసేందుకు హైదరాబాద్‌ కు ఇతర జిల్లాల నుంచి కూడా పలు పార్టీల నాయకులు వచ్చారు. దాదాపు 5 వేల మంది నాయకులు, వారి అనుచరులు హోటళ్లలోనే ఉంటున్నారు. హోటళ్లలో సీటింగ్‌ సామర్థ్యం కూడా 75 శాతానికి పెరిగిందని హోటల్ యజమానులు కొందరు చెబుతున్నారు.  ప్రధానంగా చికెన్, మటన్‌ బిర్యానీ ఆర్డర్లు పెరిగాయని తెలిపారు.

More Telugu News