Bandi Sanjay: 192 దేశాల్లో టపాసులు కాల్చినప్పుడు రాని కాలుష్యం, ఒక్కరోజు జరిపే దీపావళి వల్ల వస్తుందా?: బండి సంజయ్

  • టపాసులు కాల్చడంపై నిషేధం విధించాలన్న హైకోర్టు
  • హైకోర్టు నిర్ణయంపై వివాదం లేదన్న బండి సంజయ్
  • కానీ ప్రభుత్వ నిర్ణయంతో చిరువ్యాపారులు నష్టపోతున్నారని వెల్లడి
  • పండుగకు ఒక్కరోజు ముందు నిషేధం విధించడంపై అసంతృప్తి
 Bandi Sanjay comments on fireworks ban in Telangana

కరోనా పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో బాణసంచా కాల్చడంపై నిషేధం విధించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. రాష్ట్రంలో కరోనా నెలకొని ఉన్న పరిస్థితుల్లో దీపావళి పండుగ సందర్భంగా తెలంగాణలో టపాసుల అమ్మకాలు, కాల్చడంపై నిషేధం విధించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంపై ఎలాంటి వివాదం లేదని తెలిపారు. కరోనా దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన మార్గదర్శకాలను హిందూ సమాజం పాటిస్తుందని స్పష్టం చేశారు.

అయితే, రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే చిరువ్యాపారులు నష్టపోతున్నారని విమర్శించారు. పండుగకు కేవలం ఒక్కరోజు ముందు బాణసంచాను నిషేధించడం ఆందోళనకరమని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. హిందుత్వాన్ని అణచివేయాలని చూసిన  మొఘలులు, నిజాం కాలగర్భంలో కలిసిపోయారని, సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి కూడా భవిష్యత్తులో అదే గతి పడుతుందని వ్యాఖ్యానించారు.

192 దేశాల్లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా టపాసులు కాల్చితే రాని కాలుష్యం, ఒక్కరోజు జరుపుకునే దీపావళి వల్ల వస్తుందా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హిందువులన్నా, హిందువుల పండుగలన్నా ఏమాత్రం చిత్తశుద్ధిలేదని విమర్శించారు. హిందూ ధర్మంపై విషం చిమ్మాలని చూస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన శాస్తి జరుగుతుందని, అంతిమవిజయం ధర్మానిదేనని బండి సంజయ్ స్పష్టం చేశారు.

More Telugu News