Pawan Kalyan: అన్నయ్య చిరంజీవి కరోనా బారినపడడంతో మేమంతా విస్తుపోయాం: పవన్ కల్యాణ్

  • చిరంజీవికి కరోనా పాజిటివ్
  • తన సోదరుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడని పవన్ వెల్లడి
  • లక్షణాలు లేకపోయినా పాజిటివ్ వచ్చిందని వివరణ
Pawan Kalyan responds after his brother Chiranjeevi tested corona positive

మెగాస్టార్ చిరంజీవి కరోనా బారినపడిన విషయంపై పవన్ కల్యాణ్ స్పందించారు. అన్నయ్య చిరంజీవి కరోనా వైరస్ కు గురయ్యారన్న వార్త తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. తన సోదరుడు లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా, ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగించారని పవన్ వెల్లడించారు. తనవంతు సామాజిక బాధ్యతతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారని వివరించారు.

ప్రజారోగ్యంపై తన అన్నయ్య చిరంజీవికి ఎంతో అవగాహన ఉందని, తన ఆరోగ్యం పట్ల కూడా అంతే జాగ్రత్తగా ఉంటారని వెల్లడించారు. అలాంటి తన అన్నయ్య కరోనా బారినపడ్డారని తెలియగానే  తామంతా విస్తుపోయామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆయనలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా, కరోనా పాజిటివ్ అని తేలిందని పేర్కొన్నారు. తన అన్నయ్య చిరంజీవి త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేశారు.

కరోనా రెండో తాకిడిపై వైద్య ఆరోగ్య నిపుణులు  హెచ్చరికలు చేస్తున్నారని, జాగ్రత్తలు పాటించడంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం వేచిచూస్తోందని, కరోనా వైరస్ కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం జరుగుతున్న ప్రయోగాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని వివరించారు.

More Telugu News