CBI: సీబీఐ విచారణకు సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్న ఝార్ఖండ్!

  • ఉత్తర్వులు జారీ చేసిన సంయుక్త కార్యదర్శి
  • కాలు పెట్టాలంటే, ముందస్తు అనుమతి తప్పనిసరి
  • ఇప్పటికే సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్న పలు రాష్ట్రాలు
Jharkhand Becomes 8th State to Withdra Permission to CBI

కేంద్ర అత్యున్నత విచారణ బృందం సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)కి ఇన్నాళ్లూ తమ రాష్ట్రంలో కొనసాగుతున్న సాధారణ సమ్మతిని ఝార్ఖండ్ ఉపసంహరించుకుంది. కాంగ్రెస్ పాలనలో ఉన్న ఝార్ఖండ్ లో సీబీఐ విచారణలకు అనుమతివ్వబోమంటూ ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా, ఈ నిర్ణయం తీసుకున్న ఎనిమిదవ రాష్ట్రంగా నిలిచింది. ఈ నిర్ణయం తరువాత, రాష్ట్ర పరిధిలో సీబీఐ విచారణ జరపాలంటే, అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాల్సిందే.

కేరళ కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకోగా, ఆపై ఒక్కరోజు వ్యవధిలోనే ఝార్ఖండ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి అనిల్ కుమార్ సింగ్ సంతకాలు చేశారు. గతంలో బెంగాల్, ఛత్తీస్ గఢ్, ఇటీవల మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు త్రిపుర, పశ్చిమ బెంగాల్ మిజోరంలు సైతం సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడి ప్రభుత్వం కొనసాగుతున్న వేళ, 2018లో సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకోగా, ఆపై వచ్చిన వైఎస్ జగన్ సర్కారు, ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న సంగతి తెలిసిందే. సీబీఐని అడ్డు పెట్టుకుని కేంద్రంలోని బీజేపీ, రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగుతోందని పలు రాష్ట్రాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News