kingsXIPunjab: పంజాబ్ పాంచ్ పటాకా.. కోల్‌కతా చిత్తు

  • తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చతికిలపడిన కోల్‌కతా
  • ప్లే ఆఫ్స్ రేసులోకొచ్చిన పంజాబ్
  • చెలరేగిన గేల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
Punjab romp 5th successive win

ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఘన విజయం సాధించింది. గత రాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత పంజాబ్ బౌలర్లు కోల్‌కతాను 149 పరుగులకే కట్టడి చేయగా, లక్ష్య ఛేదనలో గేల్, మన్‌దీప్ సింగ్ చెలరేగిపోవడంతో పంజాబ్ సునాయాసంగా విజయాన్ని అందుకుంది. ఫలితంగా 12 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకోగా, ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐదో స్థానానికి దిగజారింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేసింది. శుభ్‌మన్ గిల్ 45 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 57; కెప్టెన్ మోర్గాన్ 25 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 40; లాకీ పెర్గ్యూసన్ 13 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్ తో 24 పరుగులు చేశారు. నితీశ్ రాణా, కార్తీక్ డకౌట్ కాగా, మిగతా వారు పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు.

నిజానికి పది ఓవర్లకు కోల్‌కతా నాలుగు వికెట్ల నష్టానికి 90కిపైగా పరుగులు చేయడంతో భారీ స్కోరు నమోదవుతుందని భావించారు. అయితే, పంజాబ్ బౌలర్లు పట్టుబిగించి వరుసపెట్టి వికెట్లు తీయడంతో కోల్‌కతా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. షమీ మూడు వికెట్లు తీసుకోగా, జోర్డాన్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు, మ్యాక్స్‌వెల్, మురుగన్ అశ్విన్ చెరో వికెట్ నేల కూల్చారు.

అనంతరం 150 పరుగుల విజయ లక్ష్యంతో మైదానంలో దిగిన పంజాబ్ 18. 5 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించిన అనంతరం కెప్టెన్ కేఎల్ రాహుల్ (28) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ వీర విహారం చేశాడు. కోల్‌కతా బౌలర్లను చితకబాదాడు.

29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 పరుగులు చేసి విజయానికి మూడు పరుగుల ముందు అవుటయ్యాడు. మరోవైపు క్రీజులో కుదురుకున్న మన్‌దీప్ సింగ్ కూడా బ్యాట్ ఝళిపించాడు. బౌండరీలతో విరుచుకుపడ్డారు. 56 బంతులు ఎదుర్కొన్న మన్‌దీప్ 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. దీంతో మరో 7 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ విజయాన్ని అందుకుంది. ధనాధన్ ఇన్సింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించిన క్రిస్‌గేల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ఐపీఎల్‌లో భాగంగా నేడు ఢిల్లీ కేపిటల్స్, హైదరాబాద్ సన్‌రైజర్స్ మధ్య దుబాయ్‌లో మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్‌కు ఇది నామమాత్రపు మ్యాచ్ కాగా, ఢిల్లీ కనుక విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంది.

More Telugu News