Hyderabad: ప్రేమించి ముఖం చాటేసిన ప్రియుడు.. పెళ్లి చేసుకోవాలని అడిగితే కత్తితో పొడిచి చంపిన వైనం!

  • హైదరాబాద్‌లోని రెయిన్ బజార్‌లో ఘటన
  • లా నాలుగో ఏడాది చదువుతున్న యువతి
  • సోదరుడితో కలిసి ప్రియురాలిని హత్య చేసిన యువకుడు
young man killed his girl friend after argument

ప్రేమించి ముఖం చాటేసిన ప్రియుడిని పెళ్లి చేసుకోమని అడిగిన పాపానికి యువతి దారుణ హత్యకు గురైంది. హైదరాబాద్‌లోని రెయిన్ బజార్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణఖేడ్‌కు చెందిన రాధిక (23) తల్లిదండ్రులతో కలిసి ఆసిఫ్‌నగర్‌లో ఉంటూ దిల్‌సుఖ్‌నగర్‌లోని మహాత్మాగాంధీ లా కళాశాలలో నాలుగో ఏడాది చదువుతోంది. అదే సమయంలో పీపుల్స్ ఫర్ యానిమల్ సొసైటీలో వలంటీరుగానూ పనిచేస్తోంది. ఈ క్రమంలో అదే సంస్థలో వలంటీరుగా పనిచేస్తున్న రెయిన్‌బజార్‌కు చెందిన ముస్తఫా (19)తో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది.

అయితే, నెల రోజుల నుంచి రాధికకు ముస్తఫా దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేయడంతో ఏం జరిగిందో తెలుసుకుందామని శనివారం రాత్రి రాధిక అతడి ఇంటికి వెళ్లింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు ఎందుకిలా చేస్తున్నావని నిలదీసింది. తెల్లవారుజాము వరకు వారి మధ్య వాగ్వివాదం జరిగింది. అయినప్పటికీ రాధిక వెనక్కి తగ్గకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ముస్తఫా, తన సోదరుడు జమీల్ (23)తో కలిసి రాధికను కత్తితో పొడిచి చంపేశాడు. నిందితులపై హత్య, అట్రాసిటీ కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News