Budda Venkanna: మాపై దాడి చేసిన ముద్దాయిని ముఖ్యఅతిథిగా పిలిచి ఎస్సై జన్మదిన వేడుకలా?: బుద్ధా వెంకన్న ఆగ్రహం

  • గతంలో బుద్ధా, బోండా ఉమపై పల్నాడులో దాడి
  • ఎస్సై జన్మదిన వేడుకల్లో ముద్దాయి తురకా కిశోర్ దర్శనం
  • ఓ దినపత్రికలో ఫొటో ప్రచురణ
  • సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలన్న బుద్ధా
  • తాము ఆరోజే చెప్పామన్న బోండా ఉమ
Budda Venkanna and Bonda Uma slams AP police

కొన్నినెలల కిందట పల్నాడు ప్రాంతంలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమ తదితరులపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే, నాడు తమపై దాడి చేసిన వ్యక్తిని ఓ ఎస్సై పుట్టినరోజు వేడుకలకు ముఖ్యఅతిథిగా పిలిచారంటూ బుద్ధా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పత్రికలో వచ్చిన కథనాన్ని కూడా తన ట్వీట్ కు జత చేశారు.

"డీజీపీ గారూ... మాచర్ల పీఎస్ పరిధిలో నా మీద, బోండా ఉమ పైనా వైసీపీ నేత తురకా కిశోర్ హత్యాయత్నం చేశాడు. మాచర్ల పోలీస్ స్టేషన్ లో అతడిపై కేసు కూడా నమోదైంది. దాడి జరిగినప్పుడు ఉన్న సీఐ సమక్షంలోనే ఇవాళ ముద్దాయిని ముఖ్య అతిథిగా పిలిచి పోలీస్ స్టేషన్ లో ఎస్సై జన్మదిన వేడుకలు జరిపారు... దీన్నిబట్టి ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారో మీరే చెప్పాలి. వెంటనే సంబంధిత అధికారులను సస్పెండ్ చేసి శాంతిభద్రతలను కాపాడాలి" అంటూ డీజీపీని డిమాండ్ చేశారు.

మేం ఆ రోజే చెప్పాం: బోండా ఉమ

అప్పట్లో తాము మాచర్ల ప్రాంతంలో పర్యటనకు వస్తున్న విషయం కేవలం పోలీసులకు మాత్రమే తెలుసని, ఇప్పుడా ముసుగు తొలగిపోయిందని టీడీపీ నేత బోండా ఉమ పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాము ఆరోజే చెప్పామని వివరించారు. "ఏమంటారు పోలీసుల సంఘాలూ... ఇక ఎస్పీ, డీజీపీ పుట్టినరోజులకు కూడా పిలవండి! జగన్ రాజ్యంలో రౌడీలదే రాజ్యం" అంటూ ఉమ ట్వీట్ చేశారు.

More Telugu News