RCB: ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ... మాయ చేసిన చాహాల్... వెరసి ఆర్సీబీకి మరో విజయం!

  • ఆర్ఆర్ పై 154 పరుగులను ఛేదించిన కోహ్లీ సేన
  • మూడవ విజయాన్ని అందుకున్న ఆర్సీబీ
  • పడిక్కల్ అద్భుతంగా ఆడుతున్నాడన్న కోహ్లీ
RCB All Round Game Wins Third Match

నాలుగు రోజుల నాడు సూపర్ ఓవర్ లో ముంబై ఇండియన్స్ పై సాధించిన విజయం ఆత్మ విశ్వాసాన్ని పెంచగా, నిన్న రాత్రి రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో తొలుత బంతితో, ఆపై బ్యాట్ తో ఆల్ రౌండ్ ప్రతిభను కనబరిచిన బెంగళూరు మూడవ విజయాన్ని అందుకోగా, రాజస్థాన్ వరుసగా రెండో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. తొలి మ్యాచ్ ఆడుతున్న మహిపాల్ లొమ్రార్ 47 పరుగులతో రాణించాడు. ఇదే సమయంలో చాహాల్ తన స్పిన్ మాయాజాలంతో మూడు వికెట్లను తీయగా, ఆ జట్టు స్కోరు పెద్దగా పెరగలేదు. ఆపై 155 పరుగుల విజయ లక్ష్యంతో ఆర్సీబీ బరిలోకి దిగింది.

ఓపెనర్ దేవ్ దత్ మరోసారి రాణించి 45 బంతుల్లోనే 63 పరుగులు చేయగా, కెప్టెన్ కోహ్లీ 53 బంతుల్లో 72 పరుగులు చేసి, విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ తిరిగి ఫామ్ లోకి రావడం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లకు, అభిమానులకు నూతనోత్సాహాన్ని అందించిందనడంలో సందేహం లేదు.

మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, కొన్నిసార్లు ఫామ్ ను కోల్పోవడం సహజమని, అయితే, జట్టు గెలుస్తుంటే, ఏ ఆటగాడైనా ఫామ్ లోకి వస్తాడని వ్యాఖ్యానించారు. దేవ్ దత్ అద్భుత నైపుణ్యంతో ఆడుతున్నాడని, చాలా కచ్చితమైన షాట్లను అలవోకగా బాదుతున్నాడని కితాబిచ్చారు.కాగా, 2013 తరువాత, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు, తన తొలి నాలుగు మ్యాచ్ లలో మూడు మ్యాచ్ లలో గెలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

More Telugu News