Bihar: కాంగ్రెస్ తో సీట్ల పంపకాలు ఖరారు.. సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్!

  • బీహార్ లో మొత్తం స్థానాల సంఖ్య 243
  • 144 స్థానాల్లో పోటీ చేయనున్న ఆర్జేడీ
  • 70 స్థానాల్లో బరిలోకి దిగనున్న కాంగ్రెస్
Tejashwi Yadav to lead opposition in Bihar Assembly elections

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఖరారయ్యాయని మహాకూటమి ప్రకటించింది. బీహార్ లో మొత్తం 243 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా... ఆర్జేడీ 144 స్థానాల్లో పోటీ చేయనుంది. కాంగ్రెస్ పార్టీ 70, వామపక్షాలు 29 స్థానాలలో పోటీ చేయనున్నాయి.

ఇక వామపక్షాలకు కేటాయించిన స్థానాల్లో సీపీఐ ఎంఎల్ 19, సీపీఐ 6, సీపీఎం 4 స్థానాల్లో బరిలోకి దిగనున్నాయి. ఝార్ఖండ్ ముక్తి మోర్చా, వికాస్ ఇన్సాఫ్ పార్టీలకు ఆర్జేడీ తన సీట్ల నుంచి కేటాయించనుంది. మరోవైపు ఒక లోక్ సభ స్థానానికి జరిగే ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని నిలపాలని నిర్ణయించారు.

మహాకూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ను నిలబెడుతున్నట్టు మహాకూటమి ప్రకటించింది. లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడే తేజస్వి అనే విషయం తెలిసిందే. మరోవైపు బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ పార్టీల మధ్య సీట్ల పంపకం ఇంకా ఒక కొలిక్కి రాలేదు.

More Telugu News