Siromani Akalidal: శిరోమణి అకాలీదళ్ తో బీజేపీ అమీతుమీ... హర్ సిమ్రత్ కౌర్ రాజీనామాకు ఆమోదం!

  • రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి
  • ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ బాధ్యతలు తోమర్ కు అప్పగింత
  • రాజ్యసభలో ఇవే బిల్లులపై ఉత్కంఠ
BJP Ready to Fight With His Old Allay SAD

నిన్న తన కేంద్ర మంత్రి పదవికి హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా చేయగా, ఈ ఉదయం రాష్ట్రపతి దాన్ని ఆమోదించారు. దీంతో శిరోమణి ఆకాలీదళ్ తో బీజేపీ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైందన్న సంకేతాలు వెలువడ్డాయి.

నిన్నటివరకూ హర్ సిమ్రత్ కౌర్ నిర్వహించిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ బాధ్యతలను మరో కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కు అప్పగించినట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 క్లాజ్ 2 ప్రకారం ఆమె రాజీనామాను ఆమోదించినట్లు ఈ సందర్భంగా రాష్ట్రపతి తెలియజేశారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖను అదనపు బాధ్యతగా చూడాలని ఈ సందర్భంగా నరేంద్రసింగ్ తోమర్ ను రాష్ట్రపతి కోరారు.

కాగా, నిన్న పార్లమెంటులో ఎన్డీయే సర్కారు వ్యవసాయ చట్టాల సవరణ బిల్లులను ప్రవేశపెట్టగా, ఆది నుంచి వీటిని వ్యతిరేకిస్తూ వచ్చిన శిరోమణి అకాలీదళ్, మరోసారి తన అసంతృప్తిని తెలియజేసింది. గతంలో ఆర్డినెన్స్ లుగా వచ్చి, ఇప్పుడు ఆమోదం కోసం పార్లమెంట్ ముందుకు బిల్లులు వచ్చాయి. వీటికి వ్యతిరేకంగా ఓటు వేయాలని తమ ఎంపీలకు ఎస్ఏడీ విప్ ను కూడా జారీ చేసింది. అయినప్పటికీ, లోక్ సభలో తనకున్న బలంతో బీజేపీ వీటిని సులువుగా నెగ్గించుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అకాలీదళ్.. కేంద్రంలో మంత్రిగా ఉన్న పార్టీ అధినేత సుఖ్ బీర్ బాదల్ భార్య, హర్ సిమ్రత్ చేత తన పదవికి రాజీనామా చేయించింది.

కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక ఆర్డినెన్సులు, కొత్త చట్టాలను అడ్డుకునేందుకు తామెంతో ప్రయత్నించామని, ఈ బిల్లులకు నిరసనగానే తాను రాజీనామా చేస్తున్నానని ఆమె తెలిపారు. రైతుల సోదరిగా, వారి బిడ్డగా నిలిచినందుకు గర్వపడుతున్నానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. రాజీనామాకు కారణాలను వివరిస్తూ ప్రధాని మోదీకి నాలుగు పేజీల లేఖ రాసినట్టు తెలిపారు. ఇక తమ పార్టీ ఎన్డీయేలో కొనసాగాలా? వద్దా? అన్న విషయాన్ని పార్టీ కోర్ కమిటీ నిర్ణయిస్తుందని బాదల్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఎన్డీయేలో సుదీర్ఘకాలం నుంచి భాగస్వామిగా ఉన్న ప్రధాన పార్టీల్లో ఒకటైన ఎస్ఏడీని కాదని బీజేపీ ముందడుగు వేసిందంటే, లోక్ సభలో ఆ పార్టీకి సొంతంగా బలం ఉండటమే కారణమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ బిల్లులపై బీజేపీ సర్కారు ఆది నుంచి బలంగానే ఉందన్న విషయం విదితమే. కరోనా సమయంలో తక్షణం అమలు చేయాలన్న ఆలోచనతో కేంద్రం వాటిని ఆర్డినెన్స్ ల రూపంలో తీసుకుని వచ్చింది. కాగా, లోక్ సభలో బీజేపీకి తిరుగులేకపోయినా, రాజ్యసభలో మాత్రం బిల్లులు ఆమోదం పొందాలంటే, సహచర పార్టీల మద్దతు బీజేపీకి అవసరమైన నేపథ్యంలో తదుపరి ఏం జరుగుతుందన్న విషయమై ఉత్కంఠ నెలకొనివుంది.

More Telugu News