Andhra Pradesh: ఏపీలో కాస్త నిదానించిన కరోనా... తగ్గుతున్న పాజిటివ్ కేసులు, మరణాలు!

  • తాజాగా 7,956 కేసులు వెల్లడి
  • 24 గంటల వ్యవధిలో 60 మంది మృతి
  • 9,764 మంది డిశ్చార్జి
Corona positive cases fatalities slightly declines in AP

ఏపీలో గత కొన్నిరోజుల పాటు నిత్యం 10 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. అయితే గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులను పరిశీలిస్తే క్రమంగా ఉద్ధృతి తగ్గుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెల 10వ తేదీన విడుదలైన బులెటిన్ లో 10 వేలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. 11వ తేదీన 9,999, 12వ తేదీన 9,901, 13వ తేదీన 9,536 కేసులు నమోదయ్యాయి. తాజాగా విడుదల చేసిన బులెటిన్ లో 7,956 పాజిటివ్ కేసులు వచ్చినట్టు పేర్కొన్నారు.

గత కొన్ని వారాలుగా కొనసాగిన ఉద్ధృతితో పోల్చితే ఇది చాలా ఊరట కలిగించే విషయం. ఇక మరణాలు కూడా తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. తాజాగా 60 కరోనా మరణాలు సంభవించాయి. గత కొన్నిరోజులుగా నిత్యం 100కు దరిదాపుల్లో మరణాలు వస్తుండడంతో జిల్లాల్లో ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది.

తాజా బులెటిన్ విషయానికొస్తే... గడచిన 24 గంటల్లో 9,764 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,75,079 కాగా, ఇప్పటివరకు 4,76,903 మందికి కరోనా నయం అయింది. ఇంకా 93,204 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 4,972కి పెరిగింది.

More Telugu News