Mahesh Babu: అమెరికాలో మహేశ్ బాబు సినిమా షూటింగ్?

  • అమెరికాలో నెల రోజుల తొలి షెడ్యూల్ 
  • ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం
  • మరోపక్క బాణీలు కడుతున్న తమన్
  • తల్లిని నిర్దోషిగా నిలబెట్టే హీరో కథ
Mahesh Babu movie shoot in US

'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ హిట్ తర్వాత మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురాం దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇంతకుముందే జరిగాయి. అయితే, రెగ్యులర్ షూటింగు మాత్రం లాక్ డౌన్ కారణంగా వాయిదాపడింది.

ఈ క్రమంలో ఈ చిత్రం తొలి షెడ్యూలు షూటింగును అమెరికాలో నిర్వహించడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ షూటింగును అమెరికాలో ప్రారంభిస్తారని తెలుస్తోంది. అక్కడ నెల రోజుల పాటు హీరో, హీరోయిన్ తదితర ప్రధాన తారాగణం పాల్గొనే పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. కథ రీత్యా అమెరికాలో షూటింగ్ చేయాల్సి వుండడంతో ఇక తప్పక అక్కడికి వెళుతున్నారట.

బ్యాంక్ మోసాల నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుంది. హీరో తల్లి బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తుందనీ, ఆమె పనిచేసే బ్యాంకులో భారీ మోసం జరుగుతుందనీ, మోసం చేసిన వ్యక్తి విదేశాలకు పారిపోతే హీరో అతనిని పట్టుకుని, చివరికి తన తల్లిని నిర్దోషిగా ఎలా బయటకు తెస్తాడన్న పాయింటుతో ఈ చిత్రం నడుస్తుందట.

మరోపక్క, ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్యూన్స్ కంపోజింగ్ జరుగుతోంది. మహేశ్ కి మంచి సూపర్ హిట్ ఆల్బం ఇచ్చేలా సంగీత దర్శకుడు తమన్ ప్రయత్నిస్తున్నాడట. ఇందులో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే!

More Telugu News