USA: ప్రణబ్ సేవలు నిరుపమానం.. యూఎస్ విదేశాంగ శాఖ ఘన నివాళులు!

  • భారత అభివృద్ధి వెనుక ప్రణబ్
  • ప్రజలు ఓ గొప్ప నేతను కోల్పోయారు
  • గుర్తు చేసుకున్న అమెరికా ప్రతినిధులు
  • సంతాపం తెలిపిన షేక్ హసీనా, వ్లాదిమిర్ పుతిన్
US Senete remembers Pranab

ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, ఈ ఏడు దశాబ్దాల్లో ప్రణబ్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలు మరువరానివని యూఎస్ విదేశాంగ శాఖ కొనియాడింది. స్వతంత్ర భారత చరిత్రను, ప్రణబ్ ను విడదీయలేమని, ఇండియాలో జరిగిన అభివృద్ధి వెనుక ఆయన చేసిన కృషి ఎంతో ఉందని పలువురు ప్రణబ్ ను గుర్తు చేసుకున్నారు. భారత ప్రజలు ఓ గొప్ప నేతను కోల్పోయారని, ప్రణబ్ ముఖర్జీ పేరు తరతరాలు వినిపిస్తుందని విదేశాంగ శాఖ పేర్కొంది.  

ప్రణబ్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్స్ బ్యూరో దక్షిణాసియా విభాగం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని పేర్కొంది. కాగా, 84 ఏళ్ల వయసులో చికిత్స పొందుతూ ప్రణబ్ ముఖర్జీ, నిన్న సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే.

ప్రణబ్ ముఖర్జీ మరణం తనకు బాధను కలిగించిందని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వ్యాఖ్యానించారు. ఆయన మృతిపట్ల సంతాపాన్ని తెలిపిన ఆమె, ఇండియా, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక బంధాలు బలపడటంలో తన తండ్రి హయాంలో ప్రణబ్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సంతాపాన్ని తెలుపుతూ ముఖర్జీ ఓ గొప్ప రాజకీయ యోధుడని అభివర్ణించారు. రష్యా, ఇండియాల మధ్య స్నేహ బంధం గొప్పగా ఉందంటే, అందుకు ప్రణబ్ కూడా కారణమేనని అన్నారు.

More Telugu News