Congress: సోనియాగాంధీ బాధపడి ఉంటే క్షమించాలి: వీరప్ప మొయిలీ

  • పార్టీకి సోనియా తల్లిలాంటి వారు
  • ఆమె నాయకత్వాన్ని మేమెప్పుడూ ప్రశ్నించలేదు
  • పార్టీలో జవసత్వాలు నింపాలన్నదే మా ఉద్దేశం
sorry if we hurt sonia gandhi feelings says veerappa moily

కాంగ్రెస్ పార్టీకి సోనియాగాంధీ తల్లిలాంటివారని, తమ లేఖతో ఆమె బాధపడి ఉంటే క్షమించాలని ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని పునర్నిర్మించి, పార్టీలో జవసత్వాలు నింపాలన్న ఉద్దేశంతోనే లేఖ రాశామని, తమ డిమాండ్లు సరైనవేనని ఆయన సమర్థించుకున్నారు. అంతే తప్ప సోనియా నాయకత్వాన్ని తామెప్పుడూ ప్రశ్నించలేదన్నారు.

పార్టీకి ఆమె తల్లిలాంటి వారని, తామెప్పుడూ ఆమెకు మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. సోనియా మనోభావాలను గాయపరచాలన్న ఉద్దేశం తమకు లేదని, తమ లేఖతో ఆమెను బాధపెట్టి ఉంటే క్షమించాలని మొయిలీ కోరారు. కాంగ్రెస్‌లో తీవ్ర వివాదానికి కారణమైన లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతల్లో వీరప్ప మొయిలీ కూడా ఉన్నారు.

సోనియాపై తమకున్న గౌరవం ఎప్పటికీ తగ్గదని, పార్టీకి తిరిగి జవసత్వాలు నింపాలన్న ఉద్దేశంతో లేఖ రాశాం తప్పితే, సోనియా అధ్యక్షురాలిగా ఉండకూడదన్నది తమ ఉద్దేశం కాదన్నారు. ఆమెపై తమందరికీ ప్రేమాభిమానాలు ఉన్నాయని, తాత్కాలిక అధ్యక్షురాలిగా ఆమె మళ్లీ బాధ్యతలు చేపట్టడాన్ని స్వాగతిస్తున్నామని మొయిలీ పేర్కొన్నారు.

More Telugu News