Union Cabinet: ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

Union cabinet approves National Recruitment agency
  • నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ ఏర్పాటుకు ఆమోదముద్ర
  • అన్ని పరీక్షలకు ఒకే ఆన్ లైన్ పరీక్ష
  • ఉద్యోగార్థులకు తప్పనున్న అనవసర శ్రమ
ఇకపై అన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే వివిధ పరీక్షలను ఒకే ఉమ్మడి పరీక్ష ద్వారా (సీఈటీ) నిర్వహించేందుకు నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఏ)ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

సమావేశానంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ ఏర్పాటుతో వివిధ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకునే ఉద్యోగార్థులు ఇకపై సీఈటీ పరీక్షను ఆన్ లైన్లో రాస్తే సరిపోతుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఖర్చుల భారం తగ్గుతుందని.. ఉద్యోగార్థులకు అనవసర శ్రమ ఉండదని, సమయం కలిసి వస్తుందని చెప్పారు.

దీని కింద నాన్ గెజిటెడ్ పోస్టుల కోసం వేర్వేరు పరీక్షలు అవసరం లేకుండా ఆన్ లైన్ సీఈటీకి హాజరైతే సరిపోతుంది. ఈ పరీక్షలో సాధించిన మార్కులు మూడేళ్ల వరకు చెల్లుబాటులో ఉంటాయి. తమ మార్కులను మెరుగుపరుచుకునే అవకాశం కూడా అభ్యర్థులకు ఉంటుంది. మరో రెండు అదనపు ఛాన్సులు ఉంటాయి. మూడింట్లో ఎక్కువగా వచ్చిన మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు.
Union Cabinet
BJP
National Recruitment Agency

More Telugu News