Corona Virus: అమెరికాలో కరోనా చికిత్స విధానం ఏపీ కరోనా ప్రోటోకాల్ ఒకేలా ఉన్నాయి: వైసీపీ

YCP says US Corona protocol similar to AP
అధికార వైసీపీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆసక్తికర అంశాన్ని పంచుకుంది. అమెరికాలో అనుసరిస్తున్న కరోనా ట్రీట్ మెంట్ ప్రోటోకాల్ కు ఏపీలో పాటిస్తున్న కరోనా చికిత్సా విధానానికి పెద్దగా తేడాలేదని అమెరికాలో స్థిరపడిన ఓ తెలుగు వైద్యురాలిని ఉటంకిస్తూ వైసీపీ ట్వీట్ చేసింది. డాక్టర్ మన్నేపల్లి సుప్రియ అమెరికాలోని గెయిన్స్ విల్లేలోని ఈశాన్య జార్జియా ఆరోగ్య వ్యవస్థలో అంటువ్యాధుల విభాగం మెడికల్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. డాక్టర్ సుప్రియ స్వస్థలం నెల్లూరు. ఇటీవల ఆమె కుటుంబ సభ్యులు కరోనా బారినపడగా, నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు. వారు కోలుకోవడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆమె ఫోన్ ద్వారా ఓ భారత మీడియా సంస్థతో మాట్లాడుతూ, అమెరికాలో కరోనా విషయంలో తాము ఎలాంటి చికిత్సా పద్ధతులు వినియోగిస్తున్నామో, ఏపీలోనూ అలాంటి ప్రోటోకాల్ నే పాటిస్తున్నారని కొనియాడారు. ఓ రోగి ఆరోగ్యస్థితిని ఎంతో నిశితంగా పరిశీలిస్తుండడం, కీలక మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తుండడం ద్వారా పరిస్థితి విషమించకముందే జాగ్రత్త పడవచ్చని తెలిపారు. ఏపీలో కరోనా రోగులకు అందిస్తున్న చికిత్స ఈ పద్ధతిలోనే సాగుతుండడం అభినందనీయమని పేర్కొన్నారు.

అంతేకాదు, ఆసుపత్రిపాలైన కరోనా రోగులకు మొదట్లోనే రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ ఇవ్వడం ఎంతో సత్ఫలితాలను ఇస్తుందని అన్నారు. శరీరంలో ఆక్సిజన్ శాతం తక్కువై, ఊపిరిత్తుల ఇన్ఫెక్షన్ అధికంగా ఉన్న సమయంలో ఈ ఇంజెక్షన్ ఎంతో సమర్థంగా పనిచేస్తుందని వివరించారు. అమెరికాలో కరోనా రోగులకు తాము విటమిన్ సి, జింక్, మెలటోనిన్, విటమిన్ డి మాత్రలు కూడా ఇస్తుంటామని, ఏపీలోనూ ఈ పద్దతి అమలు చేస్తున్నట్టు గుర్తించానని డాక్టర్ సుప్రియ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఏపీలో డాక్టర్లు అందిస్తున్న సేవలు నిరుపమానం అని కొనియాడారు.

Corona Virus
Protocol
USA
Andhra Pradesh
Dr Supriya Mannepalli

More Telugu News