SP Charan: మా నాన్న అందరినీ గుర్తుపడుతున్నారు... అమ్మ రెండ్రోజుల్లో డిశ్చార్జి అవుతారు: ఎస్పీ చరణ్

  • కరోనాతో పోరాడుతున్న ఎస్పీ బాలు
  • అర్ధాంగికి సైతం కరోనా పాజిటివ్
  • వీడియో ద్వారా వివరాలు తెలిపిన చరణ్
SP Charan tells his parents health condition

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారినపడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. బాలు అర్ధాంగి కూడా కరోనాతో ఆసుపత్రిలో చేరారు. తన తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఎస్పీ చరణ్ వివరాలు తెలిపారు. తన తండ్రి ఎస్పీ బాలును ఆసుపత్రిలోని మూడో ఫ్లోర్ లో ఉన్న జనరల్ ఐసీయూ నుంచి ఆరో ఫ్లోర్ లో ఉన్న ప్రత్యేక ఐసీయూ రూమ్ కు మార్చారని వెల్లడించారు. ఇప్పుడు కాస్త స్పృహలో ఉన్నారని, డాక్టర్లను గుర్తిస్తున్నారని, బొటనవేలు పైకెత్తి తాను బాగానే ఉన్నానన్న సంకేతాలు ఇస్తున్నారని చరణ్ ఓ వీడియోలో వివరించారు.

డాక్టర్లు కూడా ట్రీట్ మెంట్ కు ఆయన స్పందిస్తున్న తీరు చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారని, త్వరలోనే కోలుకుంటారన్న నమ్మకం ఉందని తెలిపారు. అయితే ఇవాళ ఆదివారం కావడంతో తన తండ్రికి సంబంధించిన తాజా సమాచారం తెలియాల్సి ఉందని అన్నారు. ఇక, తన తల్లి కరోనా నుంచి కోలుకుంటోందని, ఆమె మంగళవారం కానీ, బుధవారం కానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని తెలిపారు.

More Telugu News