Balineni Srinivasa Reddy: చంద్రబాబు తీరుపై మండిపడ్డ వైసీపీ నేతలు

  • చంద్రబాబు విమర్శలు సరికాదు: బాలినేని, పిన్నెల్లి 
  • జగనే లక్ష్యంగా చంద్రబాబు విమర్శలు
  • చంద్రబాబు తీరు మారాలి
  • లేదంటే రాజకీయంగా కనుమరుగుకావడం తథ్యం
balineni slams chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశమంతా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పథకాలను, ఆయన పనితీరును ప్రశంసించి అనుకరిస్తుంటే చంద్రబాబు మాత్రం రోజూ జగనే లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. చంద్రబాబు తీరు మారకపోతే రాజకీయంగా కనుమరుగుకావడం తథ్యమని జోస్యం చెప్పారు.
 
'కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే చంద్రబాబు ఎక్కడో కూర్చుని ట్వీట్లు చేస్తూ పబ్బం గడుపుతున్నారు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ ఘటన అత్యంత దురదృష్టకరం. కొవిడ్‌ ఆసుపత్రి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి 10 మంది మృతి చెందడానికి కారణమైన రమేశ్‌ ఆసుపత్రి యాజమాన్యంపై చంద్రబాబు ఎందుకు స్పందించడంలేదు?' అని ఆయన ప్రశ్నించారు.

సీఎం జగన్‌ చేస్తున్న సంక్షేమ యజ్ఞాన్ని చూసి తమకి రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవనే భయంతో టీడీపీ నేతలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం సిగ్గు చేటని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పురాణాల్లో రాక్షసులు యజ్ఞాన్ని అడ్డుకున్నట్లు ప్రభుత్వం చేసే మంచిని అడ్డుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు.

'ఓట్లు కొనడం కోసం ఎన్నికలు ముందు ‘పసుపు కుంకుమ’ పథకాన్ని చంద్రబాబు ప్రవేశపెట్టాడు. కానీ, మహిళలకు చంద్రబాబు నక్కజిత్తులు తెలిసి 23 స్థానాలు ఇచ్చారు. సంక్షోభంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న వ్యక్తి సీఎం జగన్‌' అని   పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

'సంక్షేమ కార్యక్రమాలను అడ్డం పెట్టుకొని బాబు తన కొడుకు క్షేమం కోసం పాటుపడ్డాడు తప్ప రాష్ట్రం కోసం కాదు. వైఎస్సార్ చేయూతపై విమర్శలు చేస్తే లబ్ధి పొందిన 23 లక్షల మంది మహిళలు ఈ సారి చంద్రబాబుని ఆయన పార్టీని భూస్థాపితం చేస్తారు' అని చెప్పారు.

More Telugu News