Telangana: ఎన్జీటీలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై విచారణ.. కౌంటర్‌ అఫిడవిట్ ద్వారా వ్యతిరేకించిన తెలంగాణ

  • పథకం పాతదేనన్న ఏపీ ప్రభుత్వం తరుఫున న్యాయవాది
  • తమకు రావాల్సిన నీళ్లనే తీసుకుంటున్నామని వ్యాఖ్య
  • తమ వైఖరేంటో తెలపాలని కేంద్ర పర్యావరణ శాఖకు ఎన్జీటీ ఆదేశం
  • తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు  పేర్కొన్న ధర్మాసనం
ngt reserves verdict on rayalaseema irrigation scheme

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా నిర్మించతలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఒప్పందాలకు విరుద్ధంగా ఉందంటూ చెబుతోంది. దీనిపై ఈ రోజు ఎన్జీటీ చెన్నై ధర్మాసనంలో వాదనలు ముగిశాయి.  40 వేల క్యూసెక్కుల సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులు ఎత్తిపోసేలా మార్చారంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ వేసిన పిటిషన్‌పై  ధర్మాసనం ఈ విచారణ జరిపింది.

రాయలసీమ ఎత్తిపోతల పథకం పాతదేనని ఏపీ ప్రభుత్వం తరుఫున సీనియర్ న్యాయవాది చెప్పారు. తమకు రావాల్సిన నీళ్లనే తీసుకుంటున్నామని, ఈ కేసును ముగించాలని అన్నారు. అయితే, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కౌంటర్ అఫిడవిట్ ద్వారా తెలంగాణ వ్యతిరేకించింది. ఏపీ చేపట్టిన ఆ పథకం వల్ల తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని చెప్పింది. దీంతో తమ వైఖరేంటో వారం రోజుల్లో తెలియజేయాలని కేంద్ర పర్యావరణ శాఖను ఎన్జీటీ ఆదేశించింది. ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.

More Telugu News