మెరిట్ ఆధారిత ఇమిగ్రేషన్ చట్టం... సంతకం చేయనున్నానని ట్రంప్ కీలక ప్రకటన!
- నవంబర్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు
- కొత్త ఉత్తర్వులు త్వరలోనే అమలులోకి
- మీడియా సమావేశంలో వెల్లడించిన ట్రంప్
"అత్యంత ముఖ్యమైన ఓ చట్టంపై అతి త్వరలోనే సంతకం చేయబోతున్నా. ఈ చట్టం చాలా బలంగా ఉంటుంది. మెరిట్ ఆధారిత ఇమిగ్రేషన్ దిశగా దేశం సాగనుంది. కుటుంబ బంధాలతో వీసాలు పొందే అవకాశాలు తగ్గుతాయి" అని శ్వేతసౌధంలోని రోజ్ గార్డెన్ లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. త్వరలోనే డీఏసీఏ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ ఎరైవల్స్) తేనున్నామని, త్వరలోనే ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తామని వ్యాఖ్యానించిన ఆయన, డీఏసీఏ ఎలా పని చేస్తుందో చూడాలని కన్సర్వేటివ్ రిపబ్లికన్లు కూడా ఆసక్తితో ఉన్నారని ట్రంప్ అన్నారు.
కాగా, డీఏసీఏ కార్యక్రమం అమలులోకి వస్తే, తమ తల్లిదండ్రుల వెంట డాక్యుమెంట్లు లేకుండా చిన్న వయసులోనే యూఎస్ లోకి ప్రవేశించిన వారి హక్కులు కాపాడబడతాయని, దాదాపు 7 లక్షల మంది యువతకు లబ్ది చేకూరుతుందని, వారికి వర్క్ పర్మిట్లు అందజేయబడతాయని ట్రంప్ సర్కారు చెబుతోంది.