Davindar singh: జమ్మూకశ్మీర్ డీఎస్పీ దేవిందర్ సింగ్ పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేశారు: ఎన్ఐఏ

  • ఉగ్రవాదులను తన కారులో తీసుకెళుతూ పట్టుబడిన దేవిందర్ సింగ్
  • చార్జిషీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ
  • పాక్ అతడిని ఉచ్చులోకి లాగిందన్న అధికారులు
Jammu and Kashmir DSP Davinder Singh join hands with Pakistan

సస్పెండైన జమ్మూకశ్మీర్ డీఎస్పీ దేవిందర్ సింగ్ తీవ్ర నేరాలకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. పాక్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవేందర్ సింగ్‌ పాకిస్థాన్‌కు చెందిన హిజ్బుల్ ముజాహిదీన్‌ ఉగ్రవాదులను తన కారులో తీసుకెళుతూ ఈ ఏడాది జనవరి 11న పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రస్తుతం అతడు జమ్మూకశ్మీర్ జైలులో ఉన్నాడు. ఈ కేసును విచారిస్తున్న ఎన్ఐఏ ఇటీవల అతడిపై చార్జిషీట్ దాఖలు చేసింది. దేవిందర్ సింగ్ పాకిస్థాన్‌ హైకమిషన్‌కు అత్యంత సున్నితమైన, రహస్య సమాచారాన్ని చేరవేసినట్టు నిన్న అధికారులు తెలిపారు.

దేవిందర్ సోషల్ మీడియా ఖాతాలను ఛేదించిన ఎన్ఐఏ అధికారులు.. వాటి ద్వారా అతడు పాకిస్థాన్ హై కమిషన్‌తో సంప్రదింపులు జరిపినట్టు నిర్ధారించారు. దేశానికి సంబంధించిన సున్నిత సమాచారాన్ని తెలుసుకునేందుకు పాకిస్థాన్ అతడిని ఉచ్చులోకి లాగిందని ఎన్ఐఏ తన చార్జిషీట్‌లో పేర్కొంది. పాక్ హై కమిషన్‌లో పనిచేసే షాకత్‌తో దేవిందర్ చాలా సన్నిహితంగా ఉండేవాడని అధికారులు పేర్కొన్నారు. అయితే, అతడు ఎటువంటి సమాచారాన్ని చేరవేశాడనే విషయాన్ని వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు.

More Telugu News