కరోనా హాట్‌స్పాట్‌గా మారుతున్న తెలంగాణ.. జాతీయ సగటు కంటే 3 రెట్లు అధిక తీవ్రత

Telangana has become corona hotspot
  • జాతీయ సగటు పాజిటివ్‌ రేటు 7.1 శాతం
  • తెలంగాణలో గత పది రోజులుగా పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్న కేసులు
  • రాష్ట్రంలో 21.91 శాతంగా పాజిటివ్ కేసుల రేటు
తెలంగాణలో కరోనా తీవ్రత రోజురోజుకు మరింత ఎక్కువవుతోంది. ఎంతలా అంటే.. జాతీయ సగటు కంటే మూడు రెట్లు అధికంగా రాష్ట్రంలో కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో మార్చి 2న తొలి కరోనా కేసు నమోదు కాగా, ప్రస్తుతం వీటి సంఖ్య 30 వేలు దాటిపోవడం చూస్తుంటే మహమ్మారి ఎలా వ్యాప్తి చెందుతున్నదీ అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 51.13 శాతం గత పది రోజుల్లోనే నమోదయ్యాయి. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసులు కూడా పెరుగుతుండడం గమనార్హం. గత పది రోజుల్లో అంటే జూన్ 29 నుంచి జులై 8 మధ్య రాష్ట్రవ్యాప్తంగా 52,163 మందిని పరీక్షించగా, 15,117 కేసులు వెలుగు చూశాయి. అంటే ఈ పది రోజుల్లో 29 శాతం పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కాగా, బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1,34,801 శాంపిళ్లను అధికారులు పరీక్షించగా 29,536 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ గణాంకాల ప్రకారం చూస్తే రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల శాతం 21.91గా ఉంది. ఇది జాతీయ సగటు కంటే ఎంతో ఎక్కువ. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1.07 కోట్ల నమూనాలు పరిశీలించగా 7.67 లక్షల మందికి కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయింది. అంటే జాతీయ సగటు పాజిటివ్‌ రేటు 7.1 శాతంగా ఉంది. దీనితో పోలిస్తే తెలంగాణ సగటు ఏకంగా మూడు రెట్లు అధికంగా ఉండడం ఇటు ప్రభుత్వాన్ని, అటు ప్రజలను కలవరపాటుకు గరిచేస్తోంది.
Go Back to Shorts
Telangana
COVID-19
positive cases

More Telugu News