USA: దలైలామాకు ఆశ్రయం ఇస్తున్నందుకు భారత్ కు ధన్యవాదాలు తెలిపిన అమెరికా

  • 1959 నుంచి భారత్ లోనే ఉంటున్న దలైలామా
  • ధర్మశాల నుంచి టిబెట్ ప్రభుత్వ కార్యకలాపాలు
  • దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అమెరికా
US thanked India for hosting Dalailama

టిబెట్ బౌద్ధ మత ప్రధాన  గురువు దలైలామా 1959 నుంచి భారత్ లోనే ఆశ్రయం పొందుతున్నారు. టిబెట్ పై చైనా దాష్టీకం భరించలేక దలైలామా భారత్ వచ్చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల నుంచే ప్రవాస టిబెట్ ప్రభుత్వం నడుస్తోంది. 1.60 లక్షలకు పైగా టిబెటన్లు భారత్ లో నివసిస్తున్నారు. కాగా, దలైలామా జన్మదినం (జూలై 6) సందర్భంగా అమెరికా ఓ ప్రకటన వెలువరించింది. దలైలామాకు 1959 నుంచి ఆశ్రయం ఇస్తున్నందుకు భారత్ కు ధన్యవాదాలు తెలిపింది.

"శాంతి, కరుణ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న దలైలామాకు 85వ పుట్టినరోజు శుభాకాంక్షలు. టిబెటన్ల సంఘర్షణకు, వారి వారసత్వానికి ప్రతీకగా నిలిచారు. అలాంటి మహనీయుడికి, టిబెటన్లకు ఆశ్రయం కల్పిస్తున్న భారత్ కు కృతజ్ఞతలు" అంటూ అమెరికా విదేశాంగ శాఖ సెంట్రల్ ఏషియన్ అఫైర్స్ బ్యూరో ట్వీట్ చేసింది.

అటు, అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో చైనాను క్రూరమైన దేశంగా అభివర్ణించారు. దలైలామా, ఇతర టిబెటన్ల ఆశలన్నీ అడియాసలుగా మిగిలిపోతుండడం బాధాకరమని, దుర్మార్గ చైనా హింసాత్మక పాలన ఇంకా కొనసాగుతూ ఉండడమే అందుకు కారణమని ఆరోపించారు.

More Telugu News