Corona Virus: కరోనాతో మరణించిన తమ నాయకుడి మృతదేహం కోసం... ఆరుగురిని కిడ్నాప్ చేసిన అమెజాన్ గిరిజనులు!

  • ఈక్వెడార్ అడవుల్లో ఘటన
  • గిరిజనుల డిమాండ్ కు తలొగ్గిన అధికారులు
  • ఖననం చేసిన మృతదేహం బయటకు తీసి అప్పగింత
Amazon Tribals Kidnaped 6 Persons for their King

అమెజాన్ అడవుల్లోని గిరిజనులు, తమ నాయకుడు కరోనాతో మరణించగా, మృతదేహాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ, ఇద్దరు పోలీసులు, ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరులను కిడ్నాప్ చేసి, తమ పంతం నెగ్గించుకున్నారు. ఈ విషయాన్ని ఈక్వెడార్ అంతర్గత వ్యవహారాల మంత్రి మారియా పౌలా రోమో స్వయంగా వెల్లడించారు. కరోనా వైరస్ తో గిరిజనుల నేత మరణించగా, ప్రొటోకాల్ ప్రకారం అధికారులు మృతదేహాన్ని ఖననం చేశారు.

ఆపై ఆగ్రహంతో ఊగిపోయిన దాదాపు 600 మంది గిరిజనులు, ఆరుగురిని కిడ్నాప్ చేసి, తమ నాయకుడి మృతదేహాన్ని అప్పగిస్తేనే వారిని విడుదల చేస్తామని పంతం పట్టారు. ఈ ఘటన పాస్తాజా ప్రావిన్స్ లోని అమెజాన్ అడవుల్లో జరిగింది. నిరసనకారులతో చర్చలు జరిపిన అనంతరం, పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి, వారికి అప్పగించామని, ఆ తరువాత బందీలను వారు విడిచి పెట్టారని రోమో వెల్లడించారు. కాగా, లాటిన్ అమెరికా దేశాల్లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న దేశాల్లో ఈక్వెడార్ కూడా ఒకటి. ఇక్కడ ఇప్పటికే 61 వేలకు పైగా కేసులు నమోదుకాగా, 4,800 మంది వరకూ మరణించారు.

More Telugu News