america: కరోనా మందు రెమ్‌డెసివిర్ స్టాక్‌‌ మొత్తాన్ని కొనేసిన అమెరికా!

  • కరోనా చికిత్సలో ఉపయోగపడుతున్న 'రెమ్‌డెసివిర్‌' 
  • మూడు నెలల వరకు ఉత్పత్తి చేసే డ్రగ్స్ అంతా అమెరికాకే
  • ఐదు లక్షల డోసులకు అమెరికా ఆర్డర్లు
  • గిలీడ్‌ సైన్సెస్‌, భారత జనరిక్‌ ఫార్మా సంస్థలు ఒప్పందం
Possible coronavirus drug Remdesivir goes out of stock for three months as US buys global supply

కరోనా చికిత్సలో ఉపయోగపడుతున్న 'రెమ్‌డెసివిర్‌' డ్రగ్‌ స్టాక్‌ మొత్తాన్ని అమెరికా కొనేసింది. దీంతో మూడు నెలల వరకు అమెరికా నుంచి ఇతర దేశాలకు ఈ ఔషధం అందదు. అమెరికాకు చెందిన బయో ఫార్మా సంస్థ గిలీడ్‌ సైన్సెస్‌ ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది.

'అమెరికా ఫస్ట్' అనే నినాదంతో ముందుకెళ్తున్న ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ తీరుకి అనుగుణంగా ఆ సంస్థ అమెరికాకే మొదట డ్రగ్ స్టాక్‌నంతా ఇవ్వనుంది. దాదాపు ఐదు లక్షల డోసులకు అమెరికా ఆర్డర్లు ఇచ్చింది. ‌ఈ నెల ఆ సంస్థ  ఉత్పత్తి చేసే 100 శాతం డోసులు, ఆగస్టులో ఉత్పత్తి చేసే 90 శాతం, సెప్టెంబరు నెల ఉత్పత్తిలో 90 శాతం డ్రగ్‌ అమెరికాకే ఇవ్వనుంది.

అమెరికన్లకు ఆ డ్రగ్‌ అందుబాటులో ఉండేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారని అమెరికా వైద్యశాఖ మంత్రి అలెక్స్‌ అజార్‌ ప్రకటించారు. కాగా, ఈ డ్రగ్స్‌ విషయంలో అమెరికా ఏకపక్షంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల ప్రపంచ దేశాలకు మందు లభించదని లివర్‌పూల్‌ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆండ్రూ హిల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ఎబోలా వైరస్‌ చికిత్స కోసం ఈ రెమ్‌డెసివిర్‌ను గతంలో అభివృద్ధి చేశారు. అప్పట్లో సుమారు 1.40 లక్షల డోసులను పరీక్షల కోసం పలు దేశాలకు పంపిణీ చేశారు. ఈ డోసులన్నింటినీ ఆయా దేశాలు ఇప్పటికే వాడాయి. కరోనా చికిత్స కోసం మొత్తం ఆరు రెమ్‌డెసివిర్‌  డోసులను రోగులకు ఇవ్వాల్సి ఉంటుంది.

ఆ డ్రగ్‌కు పేటెంట్‌ హక్కులున్నాయి. లైసెన్సు పొందిన సంస్థలు మాత్రమే ఈ మందును తయారు చేస్తాయి. ఈ డ్రగ్‌ను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం కోసం గిలీడ్‌ సైన్సెస్‌ భారత్‌కు చెందిన కొన్ని జనరిక్‌ ఫార్మా సంస్థలతోనూ ఇప్పటికే‌ ఒప్పందాలు కుదుర్చుకుంది.

సిప్లా, హెటెరో ల్యాబ్స్‌తో పాటు పలు సంస్థలతో ఒప్పందం కుదిరింది. భారత్‌తో పాటు ప్రపంచంలోని 127 దేశాల్లో ఈ డ్రగ్‌ను విక్రయించే అవకాశం భారత సంస్థలకు లభించింది. డగ్ర్‌ తయారీకి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం గిలీడ్‌ నుంచి భారతీయ సంస్థలకు బదిలీ అవుతుంది. ఇప్పటికే భారత్‌లోని ఆ రెండు సంస్థలకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతులు ఇచ్చింది.

More Telugu News