Raghu Ramakrishna Raju: రఘురామకృష్ణరాజు ఒక తేడా మనిషి: తణుకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు

  • నాగేశ్వరరావు అవినీతిపరుడంటూ రఘురాజు వ్యాఖ్యలు
  • ఆయనను మనిషిగా కూడా తాను చూడనన్న నాగేశ్వరరావు
  • ఆయన బీజేపీలోకి వెళ్తున్నారని వ్యాఖ్య
Raghu Ramakrishna Raju is joining BJP says Karumuri Nageswar Rao

సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహరిస్తున్న తీరుతో వైసీపీ నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ముఖ్యమంత్రి జగన్ పై తనకు ఎంతో అభిమానం ఉందని చెపుతూనే... పార్టీపై, పార్టీ నేతలపై ఆయన చేస్తున్న విమర్శలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీలో నెంబర్ 2గా చెప్పుకునే విజయసాయిరెడ్డిని ఆయన టార్గెట్ చేస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఇటీవల జగన్ కు ఆయన రాసిన లేఖలో కూడా... ఓవైపు స్వామి భక్తిని ప్రదర్శిస్తూనే... మరోవైపు తాను చేయాల్సిన విమర్శలన్నీ చేశారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పెద్ద అవినీతిపరుడని గతంలో విమర్శలు గుప్పించారు.

ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణరాజుపై ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక తేడా మనిషి అంటూ మండిపడ్డారు. ఆయనను తాను ఒక మనిషిగా కూడా గుర్తించడం లేదని చెప్పారు. ఆయన బీజేపీలోకి వెళ్లిపోతున్నారని... అందుకే మోదీ భజన చేస్తున్నారని ఆరోపించారు.

ఇదే సమయంలో టీడీపీ నేతలపై నాగేశ్వరరావు మండిపడ్డారు. తన నియోజకవర్గంలో పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాల విషయంలో తనపై బురద చల్లేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు బంధువులు వందల కోట్ల విలువైన అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని... ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఒక  అధికారి ఆత్మహత్య కూడా చేసుకున్నారని చెప్పారు.

More Telugu News