Galwan Valley: మరింత పెరుగుతోన్న ఉద్రిక్తత.. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో చైనా యుద్ధ విమానాలు

  • లడఖ్‌ వద్ద ఇరు దేశాల చర్యలు
  • పెద్ద ఎత్తున సరిహద్దుల వద్దకు సైనికులు, యుద్ధ సామగ్రి
  • స్కర్దూ స్థావరంలో చైనా ట్యాంకర్‌ విమానం
  • లడఖ్‌‌లో చైనా వాయుసేన కార్యకలాపాలు
  • యుద్ధ విమానాలతో గస్తీ పెంచిన భారత్
china india stand off at galwan

భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. చర్చల్లో ఒకమాట, చేతల్లో ఒక తీరు కనబర్చుతోన్న చైనాకు చెక్‌ పెట్టేందుకు భారత్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ల నుంచి భారీగా ఆయుధ వ్యవస్థలు లడఖ్‌‌ చేరుకుంటున్నాయి.

ఇరు దేశాలు పెద్ద ఎత్తున సరిహద్దుల వద్దకు సైనికులు, యుద్ధ సామగ్రిని తరలిస్తున్నాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో చైనా సైన్య కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. స్కర్దూ స్థావరంలో ట్యాంకర్‌ విమానం ఉంచింది. ఇది గాల్లోని యుద్ధవిమానాలకు ఇంధనం అందిస్తుంది.

తూర్పు లడఖ్‌‌లో చైనా వాయుసేన కార్యకలాపాలు మరింత విస్తృతమయ్యాయి. యుద్ధం జరిగితే పీవోకేను వినియోగించుకుని దాడి చేయాలని చైనా భావిస్తోంది. కొన్ని రోజులుగా చైనా వాయుసేన స్థావరాల్లో కదలికలు విస్తృతంగా ఉన్నాయి.

టిబెట్‌ వంటి ప్రాంతాల నుంచి యుద్ధ విమానాలను సిద్ధంగా ఉంచి, అక్కడి నుంచి వాటిని తీసుకెళ్లడం క్లిష్టమైన ప్రక్రియ కాబట్టి పీవోకేను ఇందుకు వినియోగించుకోవాలని చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాదే స్కర్దూ స్థావరాన్ని జే 17 విమానాలకు అనువుగా ఉండేలా పాకిస్థాన్‌ అభివృద్ధి చేసింది.

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇటీవలే 21 మిగ్‌ 29, 12 సుఖోయ్‌లు కొనుగోలు చేసేందుకు భారత్‌ ఆర్డర్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఎల్‌ఏసీ వెంట చైనా యుద్ధవిమానాల కదలికలు పెరిగినట్లు ఇప్పటికే గుర్తించిన భారత్‌.. సైన్యంతో పాటు  వైమానిక దళం కూడా గగన రక్షణ వ్యవస్థలను మోహరించింది. ఇప్పటికే గాల్వన్‌ లోయ వద్ద భారత యుద్ధ విమానాలు గస్తీ పెంచాయి. 

More Telugu News