Diabetes: కరోనా నుంచి కోలుకున్న వారికి కొత్త ముప్పు.. తాజా అధ్యయనం వెల్లడి!

  • డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్న పరిశోధకులు
  • కరోనా వైరస్ తో జీవక్రియలు దెబ్బతింటాయని వెల్లడి
  • గ్లూకోజ్ స్థాయుల్లో వైరుధ్యం కనిపిస్తుందని వివరణ
Research says corona patients will be affected by Diabetes

ఇప్పటికిప్పుడు ప్రపంచంలో అత్యంత భయానక వ్యాధి ఏంటంటే కరోనా మహమ్మారి అనే చెబుతారు. కరోనా వైరస్ కారణంగా కలిగే లక్షణాలు సాధారణ జలుబు లక్షణాలనే పోలి ఉన్నా, కొద్ది వ్యవధిలోనే ప్రాణాంతకంగా మారడం ఈ వైరస్ నైజం. కరోనా నుంచి కోలుకున్న వారిని అదృష్టవంతులుగా భావిస్తున్న ఈ తరుణంలో, అంతర్జాతీయ డయాబెటిస్ నిపుణుల బృందం ఆందోళన కలిగించే అంశం వెల్లడించింది.

కరోనా మరణాల్లో మధుమేహ రోగుల శాతం 20 నుంచి 30 వరకు ఉందని తెలిపింది. అంతేకాదు, కరోనా నుంచి కోలుకున్న తర్వాత చాలామందికి షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని ఈ బృందం చేపట్టిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. మోనాష్ విశ్వవిద్యాలయంలో డయాబెటిస్ ప్రొఫెసర్ పౌల్ జిమ్మెంట్ కూడా ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా కరోనా బాధితులపై పరిశీలన చేపట్టారు. వారిలో శరీరంలో చక్కెర స్థాయిని విశ్లేషించారు.

ఈ వైరస్ రెండు రకాలుగా ప్రమాదకారి అని, డయాబెటిస్ ఉన్నవాళ్లకు మరింత ముప్పు కలిగిస్తుందని, లేనివాళ్లకు డయాబెటిస్ కలిగిస్తుందని అధ్యయనంలో పేర్కొన్నారు. ఈ వివరాలను న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించారు. కరోనా వైరస్ కారణంగా శరీర జీవక్రియల లయ దెబ్బతినడమే కాకుండా, గ్లూకోజ్ స్థాయుల్లో విపరీతమైన వైరుధ్యం ఏర్పడుతుందని గుర్తించారు. టైప్-1 డయాబెటిస్ ను కలిగిస్తుందా, లేక టైప్-2 డయాబెటిస్ ను కలిగిస్తుందా? అన్నదానిపై స్పష్టత లేకపోయినా, కరోనా నుంచి కోలుకున్నవారిలో ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు.

More Telugu News