Aarogyasetu: ప్రయాణానికి ‘ఆరోగ్యసేతు’ యాప్ తప్పనిసరి కాదు: కేంద్రం

  • యాప్‌పై పలు సందేహాలు ఉన్నాయంటూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన సైబర్ కార్యకర్త
  • యాప్ డౌన్‌లోడ్ తప్పనిసరి కాదన్న కేంద్రం
  • ప్రయాణాల్లో స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుందన్న అదనపు సొలిసిటర్ జనరల్
Aarogya setu app not necessary on travelling

ప్రయాణాల్లో ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి కాదని, అది లేకుండా కూడా రైళ్లు, విమానాల్లో ప్రయాణించవచ్చని కేంద్ర ప్రభుత్వం కర్ణాటక హైకోర్టుకు తెలిపింది. బెంగళూరుకు చెందిన ఓ సైబర్ కార్యకర్త ఈ యాప్‌కు సంబంధించి పలు సందేహాలు వెలిబుచ్చుతూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్రం ఈ విషయాన్ని తెలిపింది.

యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలనేది ప్రభుత్వ సూచన మాత్రమేనని, ప్రయాణికులు ఎవరికి వారే దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని అదనపు సొలిసిటర్ జనరల్ ఎంఎన్ నర్గుంద్ కోర్టుకు తెలిపారు. ప్రయాణికులు తప్పకుండా ఆరోగ్యసేతు యాప్‌ను కలిగి ఉండాల్సిన అవసరం లేదని, దానికి బదులుగా స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని కూడా సమర్పించవచ్చని కోర్టుకు తెలిపారు.

స్పందించిన కోర్టు ప్రభుత్వ కార్యాలయాల్లోకి ప్రవేశించేవారు ఆరోగ్యసేతు యాప్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలనే నిబంధనకు సంబంధించి చట్టబద్ధత ఉంటే తెలపాలంటూ కేసు విచారణను జులై 10కి వాయిదా వేసింది.

More Telugu News