Eatala Rajender: మమ్మల్ని పనిచేసుకోనివ్వండి... ఇది మంచి పద్ధతి కాదు: ఈటల

Eatala fires on opposition parties
  • కరోనా పరిస్థితులపై ఈటల మీడియా సమావేశం
  • మార్గదర్శకాలకు అనుగుణంగానే పరీక్షలు చేస్తున్నామని వెల్లడి
  • దుష్టచర్యలు వద్దంటూ విపక్షాలకు హితవు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితుల గురించి ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగానే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. లక్షణాలు ఉన్నవారికి, వృద్ధులకు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న హైరిస్క్ వ్యక్తులకే కరోనా పరీక్షలు చేపడుతున్నట్టు వివరించారు. అయితే, కొన్ని రాజకీయ పక్షాలు తమపై విమర్శలు చేస్తున్నాయని, కొందరు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

వాళ్లకో న్యాయం మాకో న్యాయం అన్నట్టుగా మాట్లాడుతున్నారని, ఈ సమస్యను ఎవరూ రాజకీయ కోణంలో చూడరాదని, ఇది ప్రపంచం మొత్తం ఉన్న సమస్య అని స్పష్టం చేశారు. కేంద్రం ప్రకటించిన అన్ని లాక్ డౌన్ మార్గదర్శకాలను పాటిస్తున్నామని, ఐసీఎంఆర్ నియమావళిని అనుసరిస్తున్నామని చెప్పారు. తాము ఇంత చేస్తున్నాగానీ, కొందరు కోర్టుల్లో పిటిషన్లు వేయడం వంటి రకరకాల పద్ధతుల్లో ప్రభుత్వాన్ని పనిచేసుకోనివ్వకుండా అడ్డుతగులుతున్నారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏవైనా సూచనలు, సలహాలు ఇచ్చి ప్రభుత్వానికి సహకరించాలే తప్ప, దుష్ట చర్యలు చేయరాదని హితవు పలికారు. తమ పని తాము చేసుకోనివ్వాలని స్పష్టం చేశారు.
Eatala Rajender
Corona Virus
Opposition Parties
Telangana
COVID-19

More Telugu News