TTD: తిరుమల వసతి గదుల్లో ఒక్కరోజు మాత్రమే భక్తులకు అనుమతి: టీటీడీ ఈవో

  • జూన్ 8 నుంచి ఆన్ లైన్ బుకింగ్ ప్రారంభం
  • ఒక్కో గదిలో ఇద్దరికి మాత్రమే అనుమతి
  • ప్రతి 2 గంటలకు ఓసారి లడ్డూ కౌంటర్లు మార్చుతామని వెల్లడి
TTD EO Singhal explains new decisions

కొన్నాళ్లుగా దర్శనాలు నిలిపివేయడంతో కళ తప్పిన తిరుమల క్షేత్రం మరికొన్ని రోజుల్లో పూర్వపు సందడి సంతరించుకోనుంది. దర్శనాలకు అనుమతి ఇవ్వాలని టీటీడీ నిర్ణయించగా, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వసతి, ఇతర అంశాలపై మీడియాకు వివరాలు తెలిపారు. ఈ నెల 8న ఆన్ లైన్ బుకింగ్ ప్రారంభం కానుందని, జూన్ నెల కోటా మొత్తం విడుదల చేస్తామని చెప్పారు. వసతి గదుల్లో ఒక్కరోజు మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుందని, ఒక్కో గదిలో ఇద్దరు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు.

గంటకు 500 మందికి శ్రీవారి దర్శనం కల్పిస్తామని వివరించారు. శ్రీవారి ఆలయంలోని ఉప ఆలయాల దర్శనం ఉండదని సింఘాల్ వెల్లడించారు. క్యూలైన్లలో ప్రతి 2 గంటలకు ఓసారి శానిటైజేషన్ చేస్తారని, 500 మంది సిబ్బందికి పీపీఈ కిట్లు ఇచ్చే అవకాశముందని తెలిపారు. అంతేగాకుండా, ప్రతి 2 గంటలకోసారి లడ్డూ కౌంటర్లు మార్చుతామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో ప్రైవేటు హోటళ్లకు అనుమతి ఇవ్వడంలేదని స్పష్టం చేశారు. ఇక టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ పరిమితంగా అనుమతించాలని భావిస్తున్నట్టు వివరించారు.

More Telugu News