West Godavari District: గొడవలతో విసిగిపోయి.. నిద్రిస్తున్న భర్తను మంచానికి కట్టేసి దారుణంగా చంపేసిన భార్య

  • పశ్చిమ గోదావరి జిల్లాలో ఘటన
  • గొంతుకు తాడు బిగించి హత్య.. ఆపై మర్మాంగాలు కోసేసిన వైనం
  • నేరుగా వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయిన వైనం
wife murdered Husband in west godavari dist

పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మహిళ తన భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది. నిద్రిస్తున్న భర్తను మంచానికి కట్టేసి మెడకు తాడు బిగించి చంపేసింది. అనంతరం అతడి మర్మాంగాలను తెగ్గోసింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని టి.నరసాపురం మండలం మక్కినవారిగూడేనికి చెందిన కఠారి అప్పారావు, తెలంగాణలోని దమ్మన్నపేటకు చెందిన లక్ష్మి భార్యాభర్తలు.

15 ఏళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 14 ఏళ్ల కుమార్తె ఉంది. కొన్నాళ్లపాటు సాఫీగానే సాగిన వీరి సంసారంలో ఇటీవల కలతలు రేగాయి. కూలిపనులు చేసుకుని జీవించే ఇద్దరూ మద్యానికి బానిసయ్యారు. దీంతో గొడవలు సాధారణమయ్యాయి. బుధవారం మరోమారు ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

 దీంతో విసిగిపోయిన లక్ష్మి.. రాత్రి మద్యం మత్తులో మంచంపై నిద్రపోతున్న భర్తను అదే మంచానికి తాళ్లతో కట్టేసింది. అనంతరం మెడకు తాడు బిగించి హత్య చేసింది. అక్కడితో ఆగక అతడి మర్మాంగాలను కోసేసింది. అనంతరం హత్య విషయాన్ని భర్త సోదరుడికి చెప్పి నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయింది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News