Meera Chopra: నటి మీరా చోప్రాకు బెదిరింపులు... హైదరాబాదులో ఎఫ్ఐఆర్ నమోదు

  • ఎన్టీఆర్ కంటే మహేశ్ బాబు అంటే ఇష్టమన్న మీరా చోప్రా
  • తీవ్రస్థాయిలో ట్రోలింగ్
  • జాతీయ మహిళా కమిషన్ ను ఆశ్రయించిన నటి
Meera Chopra complains to NCW over trolling

నటి మీరా చోప్రా అనూహ్య రీతిలో ఓ టాలీవుడ్ హీరో అభిమానుల ఆగ్రహానికి గురైంది. అభిమానులతో సోషల్ మీడియా లైవ్ నిర్వహిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ కంటే మహేశ్ బాబునే ఎక్కువ ఇష్టపడతానని సమాధానమిచ్చింది.

 దాంతో కొందరు వ్యక్తులు ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేయగా, ఈ విషయంలో స్పందించాలంటూ జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి ఆమె ట్వీట్ చేసింది. దాంతో అభిమానులు మరింత రెచ్చిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆన్ లైన్ లో తనను దూషించడంతో పాటు, అత్యాచారం చేస్తామంటూ బెదిరిస్తున్నారంటూ మీరా చోప్రా జాతీయ మహిళా కమిషన్ ను ఆశ్రయించింది.

దీనిపై స్పందించిన కమిషన్... మీరా చోప్రా విషయంలో జోక్యం చేసుకోవాలంటూ హైదరాబాద్ పోలీస్ ను కోరింది. ఈ నేపథ్యంలో, సైబర్ క్రైమ్ పోలీసులు సెక్షన్ 509, సెక్షన్ 506 కింద కేసు నమోదు చేశారు. దీనిపై సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎమ్ ప్రసాద్ మాట్లాడుతూ, దాదాపు ఎనిమిది మంది ఆమెను ట్రోల్ చేశారని, అభ్యంతరకర కామెంట్లు పోస్టు చేసిన వెంటనే ఆయా ట్విట్టర్ ఖాతాలు డీయాక్టివేట్ అయినట్టు గుర్తించామని వెల్లడించారు. వాటిలో చాలా ఖాతాలు ఫేక్ అని భావిస్తున్నామని, ఈ వ్యవహారంలో తమ దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

More Telugu News