Indian Railways: 30 ఏసీ ప్రత్యేక రైళ్ల బుకింగులో మార్పులు.. 30 రోజులకు పెరిగిన అడ్వాన్స్ బుకింగ్!

  • ఏడు రోజుల నుంచి నెల రోజులకు పెరిగిన అడ్వాన్స్ బుకింగ్
  • ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్ టికెట్ల జారీ
  • రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందే తొలి చార్ట్
Indian Railway made some Changes on AC Trains for ticket booking

జూన్ ఒకటో తేదీ నుంచి 200 రైళ్లు నడిపేందుకు సిద్ధమైన భారతీయ రైల్వే 30 ఏసీ రైళ్లకు సంబంధించి టికెట్ల బుకింగులో కొన్ని మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఏడు రోజులకు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం ఉండగా ఇప్పుడు దానిని 30 రోజులకు పెంచింది. అంతేకాకుండా ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్ టికెట్లను కూడా జారీ చేయనున్నట్టు తెలిపింది. వెయిటింగ్ లిస్ట్ టికెట్లు జారీ చేసినా కన్ఫామ్ కాని వారు ప్రయాణించేందుకు వీలు లేదని స్పష్టం చేసింది.

అలాగే, ఇప్పటి వరకు రైలు బయలుదేరడానికి అరగంట ముందు చార్ట్‌ను విడుదల చేసేవారు. అయితే, ఇప్పుడు ఈ నిబంధనను కూడా మార్చింది. రైలు బయలుదేరే సమయానికి నాలుగు గంటల ముందు మొదటి చార్ట్, రెండు గంటల ముందు రెండో చార్ట్‌ను విడుదల చేయనుంది. టికెట్లను ఇప్పటి వరకు ఐఆర్‌సీటీసీ, యాప్‌ల ద్వారా మాత్రమే బుక్ చేసుకునే వెసులుబాటు ఉండగా, ఇప్పుడు రిజర్వేషన్ కౌంటర్లు, పోస్టాఫీసులు, ఐఆర్‌సీటీసీ అధీకృత ఏజెంట్ల నుంచి కూడా బుక్ చేసుకోవచ్చని తెలిపింది.

More Telugu News