USA: తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 161 మంది భారతీయులను తిరిగిపంపిస్తున్న అమెరికా!

  • మెక్సికో సరిహద్దుల నుంచి అక్రమంగా చొరబాటు
  • తిప్పి పంపుతున్న వారిలో ముగ్గురు తెలుగువారు
  • అమృతసర్ కు చేర్చనున్న యూఎస్ ప్రత్యేక విమానం
US Will Deport 161 Indians this Week

దక్షిణ మెక్సికో సరిహద్దుల నుంచి తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని ఆరోపిస్తూ, 161 మంది భారత జాతీయులను అరెస్ట్ చేసిన అమెరికా, వారిని ఈ వారంలో డిపోర్ట్ చేయనుంది. వారికి ఉన్న అన్ని చట్టపరమైన అవకాశాలు మూసుకుపోగా, ఓ ప్రత్యేక విమానంలో వారందరినీ పంజాబ్ లోని అమృతసర్ కు పంపించనున్నారు.

ఇక వీరిలో 76 మంది హర్యానావాసులే కావడం గమనార్హం. ఆపై పంజాబ్ కు చెందిన 56 మంది, గుజరాత్ కు చెందిన 12 మంది, యూపీకి చెందిన ఐదుగురు, మహారాష్ట్రకు చెందిన నలుగురు, కేరళ, తమిళనాడు, తెలంగాణలకు చెందిన వారు ఇద్దరేసి, ఆంధ్రప్రదేశ్, గోవా రాష్ట్రాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

కాగా, నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నామ్ సింగ్ చాహాల్ అందించిన వివరాల మేరకు అమెరికాలోని 95 జైళ్లలో మగ్గుతున్న 1,739 మందిలో వీరూ వున్నారు. వీరందరినీ తమ దేశంలోకి అనుమతి లేకుండా ప్రవేశించారంటూ, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అదుపులోకి తీసుకుంది.

ఇదిలావుంచితే, ఐసీఈ నివేదిక ప్రకారం, 2018లో 611 మందిని ఇండియాకు తిరిగి పంపించగా, గతేడాది 1,616 మందిని ఇండియాకు తిరిగి పంపింది. ఇక ఇప్పుడు తిరిగి పంపిస్తున్న 161 మందిలో ముగ్గురు మహిళలు కూడా వుండడం గమనార్హం. మరోపక్క, ఇప్పటికీ అమెరికన్ జైళ్లలో మగ్గుతున్న ఇతర భారతీయుల పరిస్థితిపై ఏ మాత్రమూ సమాచారం లేదని సత్నామ్ సింగ్ వ్యాఖ్యానించారు. జైళ్లలో ఉన్నవారిలో అత్యధికులు ఉత్తర భారతావనికి చెందిన వారేనని, వీరిలో చాలామంది ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకుని ఉన్నారని తెలిపారు.

తమ దేశంలో హింసను ఎదుర్కొన్నామని కొందరు, కేసులు పెట్టి వేధిస్తున్నారని మరికొందరు ఆశ్రయం పొందేందుకు కారణాలు చెబుతున్నారని, అయితే, న్యాయమూర్తులు గత కొంతకాలంగా ఇటువంటి పిటిషన్లపై ఏ మాత్రం విచారణ లేకుండా కొట్టివేస్తున్నారని ఆయన అన్నారు.

More Telugu News