Andhra Pradesh: గంటగంటకు బలపడుతున్న అల్పపీడనం.. సాయంత్రానికి తుపానుగా మారే అవకాశం

  • నేటి నుంచి మూడు రోజులపాటు అల్లకల్లోలంగా సముద్రం
  • ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం
  • మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
Low pressure in Bay of Bengal chance of turning into a storm

ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో నేటి సాయంత్రానికి తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎం‌డీ) తెలిపింది. ఇది రేపు వాయవ్య దిశకు కదులుతూ 18, 20వ తేదీల్లో ఈశాన్య బంగాళాఖాతం వైపు పయనిస్తుందని ఐఎండీ పేర్కొంది.

దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల భారీ వర్షాలకూ ఆస్కారం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.

అలాగే, రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల  గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. నేటి నుంచి మూడు రోజులపాటు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.

More Telugu News