Passenger Train: లాక్ డౌన్ నేపథ్యంలో విజయవాడ చేరుకున్న తొలి ప్రయాణికుల రైలు

  • ఢిల్లీ నుంచి పలు నగరాలకు ఎక్స్ ప్రెస్ రైళ్లు
  • విజయవాడలో దిగిన 318 మంది ప్రయాణికులు
  • విజయవాడ నుంచి చెన్నై వెళ్లిన 282 మంది
First passenger train arrived Vijayawada amidst lock down

దేశంలో మూడో విడత లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో ఢిల్లీ నుంచి వివిధ నగరాలకు ప్రయాణికుల రైళ్లను అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీ నుంచి విజయవాడకు ప్రయాణికుల రైలు వచ్చింది. లాక్ డౌన్ పరిస్థితులు ఉత్పన్నం అయ్యాక విజయవాడ వచ్చిన తొలి ప్రయాణికుల రైలు ఇదే.

ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీ-చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు విజయవాడ జంక్షన్ కు చేరుకుంది. ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల నుంచి 318 మంది ప్రయాణికులు విజయవాడకు వచ్చారు. ఈ రైలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఏపీలో ప్రవేశించింది. ఇదే ఎక్స్ ప్రెస్ రైలులో విజయవాడ నుంచి 282 మంది ప్రయాణికులు చెన్నై వెళ్లారు. కాగా, విజయవాడలో దిగిన ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేసి ప్రత్యేక బస్సుల్లో క్వారంటైన్ కేంద్రాలకు తరలించనున్నారు.

More Telugu News