Haleem: లాక్ డౌన్ నేపథ్యంలో.. ఈ సారి ఇక హలీం లేనట్టే!

  • ప్రతి ఏడాదీ రంజాన్ మాసంలో హలీం ఘుమఘుమలు 
  • తయారు చేయడం లేదని పిస్తా హౌస్, షా గౌస్ ప్రకటన
  • హైదరాబాద్‌ హలీం తయారుదారీల సంఘం కూడా
No haleem for this year

హలీం ప్రియులకు చేదు వార్త. ఈ రంజాన్ మాసంలో తాము హలీం తయారు చేయడం లేదని హైదరాబాద్‌లోని  ప్రముఖ హోట్లళ్లు పిస్తా హౌస్, షాగౌస్ ప్రకటించాయి. హైదరాబాద్‌ హలీం తయారీదారుల సంఘం కూడా ఇదే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా రంజాన్ మాసం వస్తుందంటే హలీం ప్రియుల నోరూరుతుంది. హలీం కోసం జనాలు బారులు తీరుతారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని చాలా హోటళ్లు హలీం ఘుమఘుమలు వెదజల్లుతాయి. కానీ, ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంది.

తెలంగాణలో మే 7 వరకు ఆంక్షలు ఉంటాయని, ఎలాంటి సడలింపులు ఇవ్వబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అన్ని మతాల వారు పండుగలను ఇంట్లోనే జరుపుకోవాలని సూచించారు. రంజాన్ మాసంలోనూ ముస్లింలు బయటికి రాకుండా ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని  చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ సారి హలీం ఉంటుందో లేదో అన్న అనుమానాలు నెలకొన్నాయి. హలీం తయారీదారుల సంఘంతో పాటు అనేక బ్రాంచీలు ఉన్న పిస్తా హౌస్‌తో పాటు షాగౌస్ కూడా ఈ రంజాన్ మాసంలో హలీం తయారు చేయడం లేదని ప్రకటించిన నేపథ్యంలో మిగతా అన్ని హోటళ్లూ అదే దారిలో నడిచే అవకాశం ఉంది. ఈ లెక్కన ఈ సారి హలీం తినే భాగ్యం లేనట్టే!

More Telugu News