Kanna Lakshminarayana: మరోసారి ఇలా మాట్లాడితే మర్యాద ఉండదు జాగ్రత్త: విజయసాయికి కన్నా వార్నింగ్

  • విజయసాయిరెడ్డి నాపై లేని పోని ఆరోపణలు చేశారు
  • జైలు నుంచి వచ్చిన వ్యక్తి నా గురించి మాట్లాడడం హాస్యాస్పదం
  • నన్ను ఎవరూ కొనుగోలు చేసే పరిస్థితి లేదు
  • కరోనా కిట్లను కొరియా నుంచి ఎందుకు తెప్పించారు?
kanna laxminarayana fire on ap govt

'నిన్నటి వరకు టెస్టులు చేయడం లేదు. కరోనాను దాచిపెడుతున్నారని ఏడ్చిన వ్యక్తి, ఇప్పుడు ఎవరినడిగి దక్షిణ కొరియా నుంచి టెస్ట్ కిట్లు కొన్నారని సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు?' అంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. 'మళ్లీ అడుగుతున్నా... కన్నా! మీరు సుజనాకు అమ్ముడుపోయారా? లేదా? టీజేపీ (టీడీపీ జాకాల్స్‌ పార్టీ) వారు కాకుండా బీజేపీ వారు నా మీద విమర్శలు చేస్తే సమాధానం ఇస్తా' అంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కన్నా లక్ష్మీ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ రోజు గుంటూరులో కన్నా లక్ష్మీ నారాయణ మీడియాతో మాట్లాడుతూ... 'విజయసాయిరెడ్డి నాపై లేని పోని ఆరోపణలు చేశారు. జైలు నుంచి వచ్చిన వ్యక్తి నా గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. నన్ను ఎవరూ కొనుగోలు చేసే పరిస్థితి లేదు. విజయ సాయిరెడ్డి మరోసారి ఇలా మాట్లాడితే మర్యాద ఉండదు జాగ్రత్త' అని హెచ్చరించారు.

'అధికార మదంతో మాట్లాడొద్దని విజయసాయిరెడ్డికి చెబుతున్నాను. విజయ సాయిరెడ్డిపై పరువు నష్టం దావా వేస్తాను. కరోనా పరీక్ష రూ.1200కే మెడ్‌టెక్‌లో చేస్తామని గతంలో చెప్పారు. ఇప్పుడు మరి కొరియా నుంచి ఎందుకు తెప్పించారు' అని అన్నారు.

'ఛత్తీస్‌గడ్ రూ.337కు కొంటే అవే కిట్లకు రూ.700 దాకా ఎలా పెడతారు. ఛత్తీస్‌గఢ్‌లోని కిట్లు దేశంలోనే తయారైనవని అంటున్నారు. ఫలితాలకు 30 నిమిషాలు పడుతుందని అంటున్నారు. ఏపీకి తెప్పించిన కొరియా కిట్ల ద్వారా 10 నిమిషాల్లోనే కచ్చితమైన ఫలితాలు వస్తాయంటున్నారు' అని కన్నా లక్ష్మీ నారాయణ చెప్పారు.
 
'నేను నిజాలను చెబుతుంటే దుష్ప్రచారం ఎలా అవుతుంది? గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు మీ పరిస్థితి ఉంది. పర్చేజ్‌ ఆర్డర్‌ ప్రకారం ఒక్కో కిట్‌ రూ.730 ప్లస్‌ జీఎస్టీ అని మొదట చెప్పారు. అయితే, ఆరోగ్య శాఖ కార్యదర్శి మాత్రం ఒక్కో కిట్‌ రూ.640 మాత్రమే అని చెప్పారు.

కరోనా టెస్టింగ్‌ కిట్లపై ఒక్కొక్కరు ఒక్కో ధర చెబుతున్నారు. ఏపీ చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. కరోనాపై కూడా తప్పుడు లెక్కలు చెబుతూ తగ్గిపోయిందని నిరూపించుకోవడానికి తాపత్రయపడుతున్నారు. ఇలా చేసి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దామని తొందర పడుతున్నారు. ప్రభుత్వం మొత్తం తప్పుడు లెక్కలు ఇస్తోంది. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై కూడా ప్రతికూల ధోరణి కనబర్చుతున్నారు' అని కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు.

More Telugu News