గాలికి ఎగిరి వచ్చిన కరెన్సీ నోట్లు.. కరోనా భయంతో తీసుకునేందుకు జంకిన ప్రజలు!

Delhi people dare not to take currency note lying on the road
షార్ట్స్‌లో చూడండి
కరెన్సీ నోట్లను తాకడం వల్ల కూడా కరోనా సోకే అవకాశం వుందంటూ ప్రచారం జరగడం తెలిసిందే. ప్రజల్లోనూ దీనికి సంబంధించిన చైతన్యం క్రమంగా పెరుగుతోందనడానికి ఢిల్లీలో జరిగిన ఓ సంఘటనే అందుకు నిదర్శనం. రోడ్డుపై మూడు రూ.500 నోట్లు కనిపిస్తున్నా ఒక్కరూ వాటిని తీసుకోవడానికి సాహసించలేదు.

ఉత్తర ఢిల్లీలోని లారెన్స్ రోడ్ లోని ఓ ఇంటి ఎదుట పెళపెళలాడే ఐదు వందల రూపాయల కాగితాలు కిందపడి ఉండడాన్ని మొదట ఓ వ్యక్తి గమనించాడు.  ఆ తర్వాత మరికొందరు వ్యక్తులు కూడా ఆసక్తిగా వాటిని చూస్తున్నారే తప్ప వాటి దగ్గరికి వెళ్లేందుకు ఇష్టపడలేదు. చివరికి ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు.

దాంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కూడా వెంటనే ఆ నోట్ల వద్దకు వెళ్లలేదు. ఓ పోలీసు చేతి తొడుగులు ధరించి ఆ నోట్లను తీసుకుని వాటిని శానిటైజర్ తో శుభ్రపరిచాడు. ఆపై వాటిని ఓ కవర్ లో ఉంచి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. కాసేపటి తర్వాత చరణ్ జీత్ కౌర్ అనే మహిళ వచ్చి ఆ నోట్లు తనవేనని చెప్పింది.

చరణ్ జీత్ కౌర్ ఓ టీచర్. ఆమె ఏటీఎం నుంచి రూ.10 వేలు డ్రా చేసి, కరోనా భయంతో వాటిని శానిటైజర్ తో శుభ్రపరిచి బాల్కనీలో ఆరబెట్టింది. అయితే గాలికి కొన్ని నోట్లు ఎగిరి రోడ్డుపై పడ్డాయి. ఆ నోట్లనే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చరణ్ జీత్ వద్ద ఉన్న మిగిలిన నోట్ల సిరీస్ తో ఆ మూడు నోట్లు సరిపోలడంతో వాటిని ఆమెకే ఇచ్చివేశారు.
Go Back to Shorts
Currency
New Delhi
ATM
Sanitizer
Police
Corona Virus

More Telugu News