USA: అమెరికాలో ఆంక్షల సడలింపుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

  • అది నా జీవితంలో తీసుకునే అతి పెద్ద నిర్ణయం 
  • ఎప్పుడు రీఓపెన్ చేయాలనేది సవాల్‌గా మారిందన్న డొనాల్డ్
  • అగ్రరాజ్యంలో ఐదు లక్షలు దాటిన కరోనా కేసులు
 Trump made key comments on the lifting of sanctions in America

కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. కొంతకాలంగా రోజూ దాదాపు  రెండు వేల మంది వరకూ మృత్యువాత పడడంతో ఆ దేశంలో పరిస్థితి దయనీయంగా తయారైంది. వైరస్ కట్టడిపై ఆలస్యంగా మేల్కొన్న  ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా ఆంక్షలు విధించడంతో  ఆర్థిక రంగం దెబ్బతింది. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. పరిస్థితి ఇలానే కొనసాగితే  ప్రజలు ఆకలితో అలమటించే దుస్థితి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ‘రీ ఓపెనింగ్’ (ఆంక్షల సడలింపు) విషయంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆంక్షలను ఎప్పుడు ఎత్తివేయాలన్నది తమకు సవాల్‌గా మారిందని ట్రంప్ చెప్పారు. ఇది తన జీవితంలో తీసుకునే అతి పెద్ద నిర్ణయం అవుతుందన్నారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో  పెట్టేందుకు ఆంక్షల సడలింపు ఎప్పుడు ఉంటుందన్న దానిపై సరైన సయయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంలో నిపుణులు, సలహాదారులు, కొవిడ్-19పై ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ సూచనలు తీసుకుంటామన్నారు. కానీ, ఎన్ని రోజుల్లో నిర్ణయం వస్తుందనేది మాత్రం ట్రంప్ చెప్పలేదు.

అమెరికాలో ఉంటున్న విదేశీయులను తమ స్వస్థలాలకు తీసుకెళ్లడంలో నిర్లక్ష్యం వహిస్తున్న దేశాలపై ఆంక్షలు విధిస్తామని ట్రంప్  హెచ్చరించారు. ఇకపై ఆయా దేశాల నుంచి అమెరికా వచ్చే పౌరులకు వీసా నిరాకరిస్తామని తెలిపారు. ఈ విషయంలో వారం రోజుల్లో తగిన చర్యలు తీసుకోకపోతే.. ఆయా దేశాలపై ఆంక్షలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. కాగా, యూఎస్‌ఏలో ఇప్పటిదాకా ఐదు లక్షల పైచిలుకు మందికి కరోనా సోకింది. వారిలో 18 వేల పైచిలుకు రోగులు చనిపోయారు.

More Telugu News