Corona Virus: ప్రపంచవ్యాప్తంగా లక్ష దాటిన కరోనా మృతులు!

  • జనవరి 9న చైనాలో తొలి మరణం
  • 83 రోజులకు 50 వేలు చేరిన మృతులు
  • ఆపై 8 రోజుల్లోనే మరణాల రెట్టింపు
Corona Death Toll Touches 1 Lakh

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా నమోదైన మరణాల సంఖ్య లక్ష దాటింది. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ లెక్కల ప్రకారం, శుక్రవారం నాటికి 16 లక్షల మందికి పైగా బాధితులు ఉండగా, మృతుల సంఖ్య 1,00,000ను చేరింది. జనవరి 9న ఈ వైరస్ బారిన పడి, వూహాన్ లో తొలి మరణం సంభవించగా, 50 వేల మరణాలు నమోదు కావడానికి 83 రోజుల సమయం పట్టింది. ఆపై కేవలం 8 రోజుల వ్యవధిలోనే మరణాల సంఖ్య రెట్టింపై, లక్షను దాటేసింది.

గడచిన వారం రోజులుగా రోజుకు 6 నుంచి 10 శాతం మేరకు మరణాలు నమోదవుతున్నాయని రాయిటర్స్ పేర్కొంది. గురువారం నాడు ప్రపంచ వ్యాప్తంగా 7,300 మంది వైరస్ కారణంగా మృత్యువాతపడ్డారని పేర్కొంది.

1660 దశకంలో లండన్ ను తీవ్రంగా దెబ్బతీసిన ప్లేగు మహమ్మారితో ఈ మరణాలను పోల్చవచ్చని, ఆ సమయంలో నగరంలోని జనాభాలో మూడింట ఒక వంతు మంది (లక్ష మంది) మరణించారని గుర్తు చేసింది. ఆపై 1918 ప్రాంతంలో కనిపించిన స్పానిష్ ఫ్లూ ప్రపంచమంతా విస్తరించి, రెండేళ్ల పాటు మారణహోమం సృష్టించి, రెండు కోట్ల మంది ప్రాణాలను హరించింది. అయితే, ప్రస్తుతానికి కరోనాను స్పానిష్ ఫ్లూతో సమానంగా భావించలేమని వైద్య రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు.

చైనాలోని సీఫుడ్ మార్కెట్ నుంచి వ్యాపించిందని అంచనా వేస్తున్న కరోనా వైరస్, శరవేగంగా ప్రపంచమంతటికీ విస్తరించిన సంగతి తెలిసిందే. ఇక, శుక్రవారం విడుదలైన లక్ష మంది మృతులు, 16 లక్షల కేసుల గణాంకాలు వాస్తవ సమాచారం కాకపోవచ్చన్న ఊహాగానాలూ వెల్లువెత్తుతున్నాయి. చాలా మందిలో చాలా తక్కువ కరోనా లక్షణాలు, కొందరిలో ఎటువంటి లక్షణాలు కనిపించకున్నా, కరోనా పాజిటివ్ వస్తోందని, దీని ప్రకారం, అందుబాటులోని అధికారిక గణాంకాలతో పోలిస్తే, వాస్తవ గణాంకాలు తేడాగా ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇటలీ, ఫ్రాన్స్, అల్జీరియా, నెదర్లాండ్స్, స్పెయిన్, బ్రిటన్ తదితర దేశాల్లో వ్యాధి సోకిన వారిలో 10 శాతానికి పైగా మరణాలు నమోదవుతూ ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో వైరస్ పుట్టిన చైనాలో మాత్రం మరణాల రేటు 2.9 శాతం మాత్రమే.

More Telugu News