Corona Virus: ‘ప్లాస్మా థెరపీ’ ట్రయల్స్‌కు సిద్ధమవుతున్న భారత్

  • కరోనా చికిత్సలో  ఫలితాలు ఇస్తున్న  విధానం
  • ప్రయోగాలకు మార్గనిర్దేశకాలు సిద్ధం చేస్తున్న ఐసీఎమ్ఆర్
  • డీజీసీఐ నుంచి అనుమతి లభిస్తే  ముందుకు
India gears up to begin plasma therapy trials

కరోనా వైరస్‌ ను నివారించేందుకు  వ్యాక్సిన్ లేదు. అది సోకిన తర్వాత  నయం చేసేందుకు ఔషధాలు గానీ, నిర్దిష్ట చికిత్స గానీ లేవు. దీనిపై అనేక దేశాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ వచ్చేందుకు చాలా సమయం పట్టనుంది. చికిత్సలో మాత్రం ‘ప్లాస్మా థెరపీ’ అనే విధానం ఆశలు రేకెత్తిస్తోంది. ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్న ఈ విధానం ఆశాజనకంగా ఉందని అమెరికా నేషనల్‌ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (పీఎన్ఏఎస్)కు చెందిన ఓ జర్నల్ తెలిపింది.  

కరోనా నుంచి కోలుకున్న వారి రక్తం నుంచి ప్లాస్మాను సేకరించి రోగులకు ఎక్కించి ట్రీట్‌మెంట్ ఇవ్వడాన్నే ప్లాస్మా థెరఫీ అంటారు. దాంతో, ఈ విధానాన్ని భారత్‌లో కూడా ప్రయోగించాలని చూస్తున్నారు. మన దేశంలో కూడా ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ (ఐసీఎమ్‌ఆర్)  తగిన మార్గనిర్దేశకాలు తయారు చేసే పనిలో ఉంది. వాటిని  డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)కి సమర్పించి ట్రయల్స్ కోసం ఆమోద ముద్ర వేయించుకోవాలని చూస్తోంది.

కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ఈ థెరపీ మంచి మార్గమన్న అభిప్రాయాలు ఉన్నాయి. తొలుత చైనాలో పది మందికి ఈ విధానంతో చికిత్స అందించగా సత్ఫలితాలు వచ్చాయి. సీరియస్ కండిషన్‌లో ఉన్న ఈ రోగులకు ఒక డోస్  ప్లాస్మా థెరపీ ఇచ్చిన తర్వాత వారి ఆరోగ్యంలో మెరుగుదల కనిపించిందని సమాచారం. రోగులను వెంటిలేటర్ పై ఉంచి ఇతర దేశాల్లో కూడా ఈ థెరపీతో చికిత్స అందిస్తున్నారు.

More Telugu News