Crow: ఉన్నట్టుండి మరణిస్తున్న కాకులు... కారణం తేల్చేందుకు రంగంలోకి అధికారులు!

  • తమిళనాడులోని పనపాక్కం సమీపంలో ఘటన
  • వరుసగా చనిపోతున్న కాకులు
  • వైరస్ సోకిందని ప్రజల ఆందోళన
Mistary Deaths of Crows in Tamilnadu

తమిళనాడులోని పనపాక్కం సమీపంలో కాకులు పెద్దఎత్తున మరణిస్తూ ఉండటంతో కారణాన్ని కనుగొనేందుకు ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు. స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇక్కడికి సమీపంలోని పన్నియార్ గ్రామంలోని కులత్తుమేడు ప్రాంతంలో ఈ నెల 1న దాదాపు 10కి పైగా కాకులు ఒకేసారి మరణించాయి. లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా ప్రజలు బయటకు రాకపోవడంతో ఆహారం లేక కాకులు మరణించి వుంటాయని తొలుత భావించారు.

ఆపై నిత్యమూ నివాస గృహాలపై నీరసంగా కనిపిస్తున్న కాకులు, ఒకదాని తరువాత ఒకటి అకస్మాత్తుగా మరణిస్తూ ఉండటం, మృతి చెందిన కాకుల సంఖ్య ఎక్కువ కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాకులకు కరోనా వైరస్ సోకిందని, అందుకే ఇవి మరణిస్తున్నాయని మరికొందరు భయపడుతూ ఉన్నారు. స్థానికుల నుంచి విషయం తెలుసుకున్న ఆరోగ్య శాఖ అధికారుల బృందం, కాకుల మరణానికి కారణాన్ని అన్వేషించేందుకు రంగంలోకి దిగింది. వీటి మృతి వెనుక ఆకలి బాధే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న విషయాన్ని తేలుస్తామని అధికారులు అంటున్నారు.

More Telugu News