Italy: ఓవైపు కరోనా మరణ మృదంగం.. మరోవైపు ఆంక్షలను సడలిస్తున్న ఇటలీ.. తీవ్ర విమర్శలు!

  • ఇటలీలో కరోనాకు బలైన  12,428 మంది
  • పిల్లలను తల్లిదండ్రులు బయటకు తీసుకెళ్లొచ్చన్న ప్రభుత్వం
  • ప్రభుత్వ నిర్ణయం హాస్యాస్పదంగా ఉందంటున్న ఇటలీ వైద్యాధికారులు
Italy Relaxes Virus Rule Allowing Kids to Go Out With a Parent

కరోనా దెబ్బకు ఇటలీ కకావికలమైన సంగతి తెలిసిందే. నిన్న ఒక్క రోజే ఆ దేశంలో 1,648 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,05,792కు చేరగా... వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 77,635గా ఉంది. ఇప్పటి వరకు 12,428 మరణాలు సంభవించాయి.

ఓపక్క పరిస్థితి ఇంత భయానకంగా ఉన్న తరుణంలో... ఆ దేశ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం విమర్శలపాలవుతోంది. ప్రజలపై విధించిన ఆంక్షలను ఆ దేశం సడలించింది. పిల్లలను వారి తల్లిదండ్రులు ఇంటి పరిసర ప్రాంతాల్లో నడకకు తీసుకెళ్లొచ్చని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ప్రకటించారు. ఈ ప్రకటనపై అక్కడి వైద్యాధికారులు మండిపడుతున్నారు.

మిలాన్ ప్రాంతానికి చెందిన హెల్త్ చీఫ్ గిలియో గల్లెరా ఈ సందర్భంగా స్పందిస్తూ... ప్రభుత్వ నిర్ణయం హస్యాస్పదంగా ఉందని అన్నారు. వైరస్ కట్టడి కోసం కట్టుదిట్టమైన చర్యలను  కొనసాగిస్తున్న తరుణంలో ఇలాంటి నిర్ణయాలు సరికావని అన్నారు. ఇలాంటి చర్యల వల్ల పరిస్థితి మరింత అదుపుతప్పే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

More Telugu News